Viveka Murder case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన తర్వాత సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. కీలక నిందితులను గుర్తించే చర్యలు చేపట్టారు. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా గతంలో కృష్ణమోహన్ రెడ్డితోపాటు సీఎం జగన్ ఇంట్లో పనిచేసే నవీన్కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కడప కేంద్ర కారాగారంలో సీబీఐ విచారణకు కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ హాజరయ్యారు.
జనవరి 28న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని నాలుగున్నర గంటలపాటు సీబీఐ అధికారులు విచారించారు. ప్రధానంగా అవినాష్ కాల్డేటాపై ఆరా తీశారు. నవీన్ అనే వ్యక్తి పేరిట ఉన్న మొబైల్ నంబర్కు అవినాష్ ఎక్కువగా కాల్ చేసి మాట్లాడినట్లు దర్యాప్తులో గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా నవీన్ తోపాటు కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి, అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి, రిమాండు ఖైదీలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఉమాశంకర్రెడ్డి, సునీల్యాదవ్లను ఫిబ్రవరి 10న విచారణకు హైదరాబాద్కు రావాలని సీబీఐ నోటీసులిచ్చింది. వారి విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇలా సీబీఐ భిన్న కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేస్తోంది. వివేకా హత్యలో కీలక నిందితులను గుర్తించే పనిలో ఉంది. వారందరి విచారణ తర్వాత ఛార్జీషీట్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కేసును ఏపీ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని సుప్రీంకోర్టులో వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వివేకా హత్య కేసును తెలంగాణకు మార్చింది. కడప నుంచి ఈ కేసు డాక్యుమెంట్లను అధికారులు హైదరాబాద్ కు ఇప్పటికే తరలించారు.