Viveka Murder Case : వివేకా హత్య కేసులో రోజుకో కొత్త విషయంలో వెలుగులోకి వస్తోంది. నిజాలేంటో ఇక ముందు తెలుస్తాయని అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్కు కేసు బదిలీ చేయడం మంచిదే అని అన్నారు. ఈ నెల 10న హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరు కావడానికి.. సమన్లు తీసుకున్నట్లు వెల్లడించారు. సీబీఐ అధికారులు పక్కా సమాచారంతోనే అందరినీ విచారణ పిలుస్తున్నారని వెల్లడించారు. అందుకే ఇటీవల అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిచారని చెప్పారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఏంటనే దానిపై అన్ని వాస్తవాలను.. సీబీఐ అధికారులు త్వరలోనే వెల్లడిస్తారని నమ్ముతున్నట్లు దస్తగిరి చెప్పారు.
మరోవైపు వివేకా హత్య కేసుపై సీబీఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. సీబీఐ కోర్టు ఆదేశాలతో చార్జిషీట్లోని ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేశారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న సునీల్, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఉమాశంకర్రెడ్డిలకు సమన్లు జారీ చేశారు. అలాగే అప్రూవర్గా మారిన ఏ4 నిందితుడు దస్తగిరికి సీబీఐ అధికారులు సమన్లు అందజేశారు. తాజాగా సీబీఐ ఎదుటహాజరైన ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి సమన్లు అందుకున్నారు.
ఇంకోవైపు వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, సీఎం సతీమణి భారతి వద్ద సహాయకుడిగా పనిచేసే నవీన్ను శుక్రవారం విచారించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కడప జిల్లా సింహాద్రిపురం మండలం భానుకోటలో పార్వతీ సమేత సోమేశ్వరాలయ పునరుద్ధరణ వేడుకల్లో ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమం ముగించుకుని కడప సెంట్రల్ జైలు మీదుగా సీఎస్ రేణిగుంటకు బయల్దేరారు. ఆ సమయానికి కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ల సీబీఐ విచారణ ముగిసింది. కొద్దిదూరంలో సీఎస్ వేచి చూస్తుండగా… ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో రేణిగుంటకు, అక్కడి నుంచి విమానంలో విజయవాడకు వెళ్లారని సమాచారం. వీరితోపాటు నవీన్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎస్ వ్యవహారశైలిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను వెంటబెట్టుకుని మరీ తాడేపల్లికి సీఎస్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.