Droupadi Murmu: ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా విశాఖపట్నంలో పర్యటించనున్నారు. భారత నౌకాదళ దినోత్సవంలో ఆమె పాల్గొంటారు. నేవీ డే విన్యాసాల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే సమయంలో పలు ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభిస్తారు. ముర్ము పర్యటన షెడ్యూల్ను రాష్ట్రపతి భవన్ సెక్రటేరియట్ విడుదల చేసింది.
రాష్ట్రపతి డిసెంబర్ 4న మధ్యాహ్నం 2.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.25 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ బయలుదేరతారు. 3.25 గంటలకు నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. 3.35 గంటలకు డేగా నుంచి బయలుదేరి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని చోళ సూట్కు చేరుకుంటారు. చోళ సూట్ లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు.
సాయంత్రం 4.05 గంటలకు చోళా సూట్ నుంచి బయలుదేరి ఆర్కే బీచ్కి చేరుకుంటారు. నేవీ డే సందర్భంగా భారత నౌకాదళం నిర్వహించే యుద్ధ విన్యాసాలను ప్రారంభిస్తారు. విన్యాసాలు ముగిసిన అనంతరం అదే వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభిస్తారు. మరో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
సాయంత్రం 6.10కి తూర్పు నౌకాదళానికి చెందిన అనంతగిరి కేంద్రానికి రాష్ట్రపతి చేరుకుంటారు. అక్కడ నేవీ డే రిసెప్షన్ లో పాల్గొంటారు. అక్కడి నుంచి రాత్రి 7.30 గంటలకు బయలుదేరి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. 8 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి తిరుపతి బయలుదేరతారు.
విశాఖలో రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించే ప్రాజెక్టులు ఇవే..
రక్షణశాఖ కర్నూలులో నిర్మించిన నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్
నిమ్మలూరులో నిర్మించిన అడ్వాన్స్డ్ నైట్విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ
ఎన్హెచ్–340లో రాయచోటి నుంచి అంగళ్లు వరకు నిర్మించిన హైవే
ఎన్హెచ్–205లో నిర్మించిన నాలుగు లైన్ల ఆర్వోబీ
ఎన్హెచ్–44లో కర్నూలు టౌన్లోని ఐటీసీ జంక్షన్లో ఆరులైన్ల గ్రేడ్ సెపరేటెడ్ స్ట్రక్చర్, స్లిప్రోడ్స్
డోన్ శివారులోని కంబాలపాడు జంక్షన్తోపాటు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన సర్వీస్ రోడ్లు, రహదారులు
రాజమండ్రిలో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, సైన్స్ సెంటర్
శంకుస్థాపన చేసే ప్రాజెక్టు..
ఎన్హెచ్–342లో ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు రహదారి విస్తరణ పనులు