Vishal : కుప్పం నియోజకవర్గంలో నుంచి తమిళ హీరో విశాల్ పోటీ చేస్తారని కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగుతోంది. గతంలో ఈ విషయంపై విశాల్ స్పందించాడు. అక్కడ నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించాడు. అయితే మళ్లీ ఈ మధ్య కుప్పం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి విశాల్ అని టాక్ వినిపిస్తోంది. దీంతో హీరో విశాల్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. సీఎం జగన్ అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. అయినా కూడా కుప్పంలో పోటీ చేయనన్నాడు. కుప్పంలో ప్రతి విషయం తనకు తెలుసునన్నాడు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదన్నాడు. ప్రజాసేవ చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదన్నాడు. తాజాగా కుప్పం పర్యటించిన విశాల్ ఎన్నికల్లో పోటీపై అక్కడే క్లారిటీ ఇవ్వడం విశేషం.
కుప్పం నియోజకవర్గంలో గెలుపు బావుటా ఎగురవేయాలని వైఎస్ఆర్ సీపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుతోంది. అక్కడ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా 7 సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాత్రంలో మెజార్టీ భారీగా తగ్గింది.
వై నాట్ 175 నినాదంతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ కుప్పంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. చంద్రబాబును ఓడించడానికి వ్యూహాలు సిద్ధం చేశారు. కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గతంలో చంద్రబాబుపై రెండుసార్లు ఓడిపోయిన చంద్రమౌళి తనయుడు భరత్ కు కుప్పం నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు భరత్ ను ఎమ్మెల్సీని కూడా చేశారు. చంద్రబాబుపై భరత్ పోటీ చేస్తారాని జగన్ ఎప్పుడో ప్రకటించేశారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కేవలం 30 వేల మెజార్టీతో మాత్రమే గెలిచారు. అంతకు ముందు మూడు ఎన్నికల్లో చంద్రబాబుకు 60 నుంచి 70 శాతం మధ్య ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో మాత్రం 55 శాతం ఓట్లే తెచ్చుకోగలిగారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైఎస్ఆర్ సీపీ విజయకేతనం ఎగురవేసింది. కుప్పుం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ హవానే కొనసాగింది. ఇదే ఊపులో కుప్పం స్థానాన్ని వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకునేందుకు జగన్ అన్ని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పోటీపై విశాల్ పేరు తెరపైకి రావడం ఆసక్తిగా మారింది. అయితే పోటీ చేయనని విశాల్ స్వయంగా ప్రకటించడంతో రూమర్లకు చెక్ పడింది. కుప్పంలో చంద్రబాబును ఢీకొట్టేది భరతే . అయితే తండ్రి ఓటమికి తనయుడు ప్రతీకారం తీర్చుకుంటాడా? వేచి చూడాలి.