VIP Break Darshanams Cancelled (Today’s State News) : టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. మరికొద్దిరోజుల్లో మిగతా తరగతుల విద్యార్థులకు కూడా వార్షిక పరీక్షలు పూర్తయి వేసవి సెలవులు వచ్చేస్తాయి. ఇప్పటి నుంచే తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి మొక్కులు చెల్లించుకుని.. ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ.. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. యాత్రికుల రద్దీ దృష్ట్యా మూడునెలల పాటు సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాన్ని రద్దు చేసినట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి వివరించారు.
Also Read : శనివారం నాడు శ్రీవారిని ఇలా పూజిస్తే… మీ అప్పుల బాధ మాయం
ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో.. టీటీడీ నేరుగా వచ్చే భక్తులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తోంది. సిఫార్సు లేఖల దర్శనాలను నిలిపివేయడంతో.. సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం త్వరగానే అందుతుంది. ప్రస్తుతం 250 వీఐపీ బ్రేక్ టికెట్ల వరకే దర్శనాలు కల్పిస్తున్నట్లు ఈఓ తెలిపారు. భక్తుల రద్దీ పెరగనుండటంతో.. టైంస్లాట్ సర్వదర్శన టోకెన్ల కోటాను 35 వేలకు పెంచామన్నారు. ఇక స్వామివారి దర్శనార్థం క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ నిరంతరాయంగా జరుగుతుందన్నారు. అలాగే అవసరమైన వారికి వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు తెలిపారు.
తొలిసారిగా టీటీడీ తెలుగు క్యాలెండర్లను ప్రచురించినట్లు చెప్పారు. 5 వేల ఉగాది తెలుగు క్యాలెండర్లను వచ్చేవారం నుంచి భక్తులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మార్చినెలలో 21.10 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. రూ.118.49 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు ఈఓ ధర్మారెడ్డి వివరించారు.