Vinukonda murder case news today(Andhra politics news): పల్నాడులో ఓ హత్య జరిగింది. మాములు హత్య అనేకంటే దారుణహత్య అనే చెప్పాలి. నడిరోడ్డుపై రషీద్ అనే వ్యక్తి జిలానీ చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. చంపిన విధానంతోనే ఈ హత్య ఏపీలో ఓ సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఈ హత్యలోకి రాజకీయం చేరింది. అదిప్పుడు మరింత ప్రకంపనలు రేపుతోంది. అదే జగన్ వినుకొండ పర్యటనకు కారణమైంది. అదే ఇప్పుడు వైసీపీ, టీడీపీల మధ్య డైలాగ్ వార్కు ఆజ్యం పోసింది. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు గురైనప్పుడు జగన్ బెంగళూరులో ఉన్నారు.
కానీ ఈ విషయం తెలుసుకోగానే ఆయన వెంటనే తాడేపల్లికి వచ్చారు. అటు నుంచి వినుకొండకు బయల్దేరారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉందికానీ.. ఉదయమంటూ వినుకొండకు బయల్దేరిన జగన్.. సాయంత్రం వరకు కూడా అక్కడికి చేరుకోలేదు. ఇదే ఇప్పుడు అటు వైసీపీ.. ఇటు టీడీపీ మధ్య మాటల మంటలకు కారణమైంది.
వినుకొండకు వెళ్లిన జగన్.. రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అంతేకాదు.. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రషీద్ ఒక్కడే కాదు ఎన్నో హత్యలు, దౌర్జన్యాలు జరిగాయని ఆరోపించారు. అంతేకాదు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. బుధవారం ఢిల్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేసేందుకు పిలుపునిచ్చారు జగన్. నిజానికి జగన్ తాడేపల్లి నుంచి వినుకొండకు చేసిన జర్నీ సమయంలో రెండుసార్లు హైదరాబాద్కు వచ్చి తిరిగి వెళ్లవచ్చు. ఆయన అంత టైమ్ తీసుకున్నారు. అయితే దీనికి వైసీపీ అనేక కారణాలు చెబుతోంది.
వైసీపీ చెప్పిన కారణాలను ఓ సారి చూద్దాం. మొదటిది జగన్కు కేటాయించిన వాహనం పదే పదే మొరాయిస్తోంది. రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు అందుకే ఆ కారును వదిలేసి సొంత కారులో ప్రయాణించారు. జగన్కు ప్రభుత్వం భద్రతను తగ్గించింది. రోడ్డు మార్గంలో పదే పదే పోలీసులు అడ్డుకున్నారు. ఆంక్షలు విధిస్తున్నారు. కావాలనే ఆలస్యం చేస్తున్నారు. జగన్ వెంట వెళ్లిన నేతల కార్లను అనుమతించడం లేదు. 15 సార్లు జగన్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. జగన్ వస్తున్న మార్గంలో చాలా మంది అభిమానుల కోసం ఆపుతున్నారు.
ఇది వైసీపీ వర్షన్.. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. జగన్కు ఎలాంటి భద్రతను తగ్గించలేదు. కండిషన్లో ఉన్న వెహికల్నే కేటాయించామని.. అది ఇప్పటికి కూడా కాన్వాయ్లోనే వెళుతుందన్నారు. జగన్ వెంట వెళుతున్న వాహనాలను కూడా తాము ఎక్కడ అడ్డుకోలేదన్నారు. ఇక అధికార టీడీపీ మాత్రం చాలా స్ట్రాంగ్గా రియాక్టైంది. ఏపీలో జగన్ శవరాజకీయాలు ప్రారంభించారంటూ మండిపడింది.
Also Read: జగన్ లెటర్కు పురందేశ్వరి కౌంటర్, ఆ విషయం మాటేంటి?
జగన్ తమ పార్టీ కార్యకర్త చనిపోతే పరామర్శించడం తప్పు కాదు కానీ.. ఇలా వేల మందిని వెంటేసుకొని రావడం శాంతి భద్రతలను దెబ్బతీయడమే అన్నారు. అసలు జగన్కు రషీద్ కుటుంబంపై ఎలాంటి ప్రేమ, అభిమానం లేదని కావాలనే ఈ ఇష్యూను పెద్దదిగా చేయాలని చూస్తున్నారంటూ మండిపడింది. అందుకే ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేయడానికి బయలుదేరారంటూ మండిపడింది..
అంతేకాదు చంద్రబాబు, లోకేష్ను గతంలో పోలీసులతో ఎలా అడ్డుకున్నారో మర్చిపోయారా అంటూ రివర్స్ అటాక్ కూడా చేస్తోంది టీడీపీ.
మొత్తానికి జగన్ పరామర్శ ఇప్పుడు ఏపీలో రాజకీయంగా రచ్చరేపుతోంది. ఒకరు కరెక్ట్ అని.. మరొకరు తప్పంటూ వాదోపవాదాలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ చంపిన వ్యక్తి.. చనిపోయిన వ్యక్తి.. ఇద్దరూ కూడా గతంలో ఒకే పార్టీలో అంటే వైసీపీలో ఉన్నవారే.. ఇది మాత్రం నిజం.. ఇదెంత నిజమో.. ప్రస్తుతం చంపిన వ్యక్తి టీడీపీలో ఉన్నాడనేది కూడా అంతే నిజం. కానీ ఈ మర్డర్కు పార్టీలు ఎంత వరకు కారణం కాదు. వారిద్దరి మధ్య ఉన్న పరస్పర వివాదాల కారణంగానే ఈ హత్య జరిగింది అనేది పోలీసుల చెబుతున్నారు.. కానీ నిజానిజాలు ఎవరికి కావాలి. కావాల్సింది రాజకీయం.. ఇప్పుడు ఏపీలో నేతలు చేస్తోంది అదే.. ఈ విషయంతో అయినా జనాల్లోకి రావాలనేది జగన్ ఆలోచనా.. అలా రావడాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనేది అధికార పార్టీ ఎత్తుగడ.. మొత్తానికైతే ఈ రాజకీయం ఈరోజుతో ముగియదు.. అదైతే వాస్తవం.