Village Volunteer : ఏపీ ప్రభుత్వం.. ప్రజలందరికీ పాలన అందుబాటులో ఉండాలని తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాలంటీర్ల కారణంగానే రాష్ట్రంలో మహిళలు, యువతులు మిస్ అవుతున్నారంటూ వారాహి యాత్రలో పవన్ చేసిన కామెంట్స్.. తీవ్ర సంచలనం సృష్టించాయి. అందుకు తగ్గట్టుగానే వాలంటీర్ల ప్రవర్తన కూడా ఉంటుంది. చిన్నపిల్లలతో పనులు చేయించుకోవడం, డబ్బుల కోసం హత్యలు చేసిన ఘటనలు వెలుగుచూశాయి.
తాజాగా ఏలూరు జిల్లాలో మరో వాలంటీర్ చేసిన దుర్మార్గం వెలుగు చూసింది. దెందులూరు మండల పరిధిలో 10వ తరగతి చదువుతున్న బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాలంటీర్ నీలాపు శివకుమార్.. ఆధార్ కార్డులు కావాలన్న వంకతో పదే పదే బాలిక ఇంటికి వెళ్లి.. పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. తరచుగా వాలంటీర్ ఇంటికి వస్తుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా ఈ విషయం వెలుగుచూసింది. బాలిక చెప్పిందంతా విన్న తల్లిదండ్రులు వాలంటీర్ శివకుమార్ పై దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శివకుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.