Vijaysai: ఫోన్లు పోవడం కామన్. అయితే, ప్రముఖుల ఫోన్లు పోవడమనేది అస్సలే కామన్ కాదు. అందులోనూ, అల్లుడు అరెస్టై.. సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న కీలక సమయంలో ఫోన్ పోవడం మరింత అనుమానాస్పదం అంటున్నారు. ఇంకెవరు, ఇద్దంతా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించే.
ఈ నెల 21 నుంచి విజయసాయిరెడ్డికి చెందిన ఐ ఫోన్ 12ప్రో కనిపించడం లేదంటూ.. ఆయన పీఏ లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫోను పోయిన సమయం, సందర్భం.. ప్రతిపక్షాల విమర్శలకు తావిస్తోంది.
ఇదే ఛాన్స్ గా టీడీపీ సెటైర్లు వేస్తోంది. అవునా, విజయసాయిరెడ్డి తాడేపల్లి ఎప్పుడు వెళ్లారు? ఈ నెల 21న ఆయన తాడేపల్లిలో ఉన్నట్టు ఎక్కడా అప్ డేట్ కూడా లేదు. ఇంతకీ ఫోన్ పోయిందా? లేదంటే, జగన్ లాగేసుకున్నారా? అంటూ ఓ టీడీపీ మాజీ మంత్రి పంచ్ లు వేశారు. ఫోన్ దాచేసి పోలీసులకు పోయిందంటూ ఫిర్యాదు చేశారనేది ఆ పార్టీ నేతల ఆరోపణ. మరి, ఫోన్ ఎందుకు దాచేశారో కూడా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో సీబీఐ విచారణ లోతుగా సాగుతోంది. ఆ లిక్కర్ స్కాం లింకులు విజయసాయిరెడ్డికి ఉండబట్టే.. సీబీఐ వాళ్లు తన ఫోను సీజ్ చేస్తే గుట్టంతా రట్టు అవుతుందనే భయంతోనే ఫోన్ పోయిందంటూ ఫిర్యాదు చేసి నాటకం ఆడుతున్నారనేది టీడీపీ ఆరోపణ. నిజమో కాదో తెలీదు కానీ.. నిజమే అన్నట్టుగా ఆ ప్రచారం సాగుతోంది.