ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ-వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచి ఆమె వైసీపీ ప్రభుత్వం విధానాలపై మండిపడ్డారు. కేంద్ర ఇచ్చిన నిధులు ఏం చేశారని ప్రశ్నించారు. అప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంల పురందేశ్వరిని ఉద్దేశిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా సెటైర్లు విసిరారు.
ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి పనిచేయడం ఎందుకని పురందేశ్వరిని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో.. రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుకదా అంటూ సూచించారు. అలా చేస్తే ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుందంటూ ట్వీట్ చేశారు. ఓ ఫోటోను కూడా జతచేశారు విజయసాయిరెడ్డి.
ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు టీటీడీ, జనసేన పొత్తు ఉంటుందని భావిస్తుండగా… మరోవైపు జనసేన – బీజేపీ కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు కమలనాథులు. మరోపక్క రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి సోము వీర్రాజును తప్పించిన బీజేపీ హైకమాండ్.. పురందేశ్వరికి ఆ
బాధ్యతలు అప్పగించింది. అధ్యక్షురాలిగా రాష్ట్రంలో కలియతిరుగుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు పురందేశ్వరి. ఈ నేపథ్యంలో ఆమెకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.