సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల నిరాకరణ.. నియోజవర్గాల మార్పు.. వివిధ సెగ్మెంట్లకు కొత్త ఇన్చార్జ్ల నియామకాలతో వైసీపీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. వాటిని కొలిక్కి తేవడానికి పార్టీ పెద్దలు నానా తంటా పడుతుంటే.. ఇష్టానుసారం వ్యవహరిస్తున్న కొందరు మంత్రుల తీరుతో పార్టీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయంటున్నారు. ఇటీవల గుంటూరులో మంత్రి విడుదల తీరు కారణంగా పాత వివాదం మళ్లీ తెర మీదకు వచ్చిందంట .. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్గా షిఫ్ట్ అయిన ఆమె పార్టీ కార్యాలయం ప్రారంభించారు. దానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అక్కడ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మర్రి రాజశేఖర్ ఫోటో లేకుండా చేయడమే కాదు.. ఆయన్ని ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానించలేదంట. అదే ఇప్పుడు వివాదాస్పదమైంది.
వైసీపీలో సీట్ల మార్పు ఎఫెక్ట్ పాత విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చింది. గుంటూరు జిల్లాలో ఇటీవల నియోజకవర్గల ఇన్చార్జ్లను మారుస్తూ వైసిపి అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా చిలకలూరిపేట ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడుదల రజిని నీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్గా ప్రకటించారు. దీంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విడదల రజిని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. చిలకలూరిపేటకే చెందిన వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ ప్రస్తుతం గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలకి రిజనల్ కోర్డినేటర్గా ఉన్నారు. అయితే, కార్యాలయం వద్ద ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మర్రి రాజశేఖర్ ఫొటో కనిపించలేదు.
గతంలో మంత్రి విడుదల రజినికి మర్రి రాజశేఖర్ వర్గాలకు అనేక సార్లు చిలకలూరిపేటలో గొడవలు జరిగాయి. ఆ క్రమంలో రెండు వర్గాలు పోలీసుస్టేషన్లకెక్కి పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నాయి. అప్పటిలో రజిని , మర్రి గొడవల కారణంగా పల్నాడు జిల్లాకి పార్టీ అధిష్ఠానం మరొకరిని రీజనల్ కో ఆర్డినేటర్గా నియమించింది. అయితే గుంటూరు పశ్చిమానికి ఇన్చార్జ్ అయిన రజినీ పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ పార్టీ రీజనల్ కోఆర్డినేర్లు ఇద్దరు ఉన్నారు. మర్రి రాజశేఖర్తో అళ్ల అయోధ్య రామిరెడ్డి పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు.
రజనీ పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్బంగా ఫ్లెక్సీలపై అయోధ్యరామిరెడ్డి ఫొటో మాత్రమే వేసి.. మర్రి రాజశేఖర్ ఫొటో లేకుండా చేశారు. దాంతో కార్యాలయ ప్రారంభానికి మర్రి రాజశేఖర్తో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా హాజరుకాలేదు. పాత గొడవల కారణంగానే రజనీ వర్గం అలా వ్యవహరించిందని.. మంత్రి ఆదేశాల మేరకే మర్రిని అవమానించారని ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. మంత్రిగా ఉంటూ పార్టీ ప్రోటోకాల్ను విస్మరించడం ఏంటని మండిపడుతున్నారు. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఇలా పాత వివాదాలు మళ్లీ రచ్చకెక్కుతుండటం వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారిందంట.