Rajini: చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఇన్నాళ్లు తన హవాకు ఎదురులేదనుకున్న మంత్రి విడదల రజనికి వరుస షాక్లు తగులుతున్నాయా? రాజకీయాల్లో ఎప్పుడు ఒకరికే కలిసిరావు.. పరిస్తితులకు తగ్గట్టుగా మారిపోతాయి. ఒకసారి గెలిచి తమకు తిరుగులేదని భావిస్తే.. ఎప్పటికైనా దెబ్బతినక తప్పదు.. ఇప్పుడు విడదల రజనికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఓవైపు ఇంటి పోరు మరోవైపు విపక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయ్.
2019 ఎన్నికల సమయంలో సీనియర్ గా ఉన్న మర్రి రాజశేఖర్ని సైతం పక్కన పెట్టి ఆర్ధికంగా బలంగా ఉన్న రజినికి సీటు ఇచ్చింది వైసీపీ. గెలిచిన తర్వాత నుంచి సీన్ మారిపోయింది. ఆమె గెలుపుకు సపోర్ట్ చేసిన మర్రినే సైడ్ చేసేశారు. అటు ఎంపీ శ్రీకృష్ణకు సైతం చెక్ పెట్టాలని చూశారు. పైగా మంత్రి పదవి దక్కడంతో ఎక్కడా కూడా తగ్గట్లేదు. విచిత్రం ఏంటంటే తన కోసం సీటు త్యాగం చేసిన మర్రికి జగన్ మంత్రి పదవి ఇస్తానంటే.. ఆయనకు కాకుండా రజనీయే మంత్రి పదవి సాధించేశారు. మొత్తానికి ఇన్నాళ్లు… తన హవా చూపించిన.. మంత్రి విడదల రజనికి రోజు రోజుకు సీన్ రివర్స్ అవుతోంది.
మరోవైపు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు… విడదల రజనికి సవాల్ విసిరారు. ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్తో మంత్రి విడుదల రజినీ చిలకలూరిపేట నియోజకవర్గాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను నిరూపించడానికి ఎక్కడికి రమ్మన్నా వస్తా, ప్రమాణం చేయడానికైనా తాను సిద్ధం అంటూ మంత్రి రజినికి సవాల్ చేశారు.
ఇప్పటికే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు మంత్రి విడదల రజినికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఎప్పటి నుంచో ఉన్నాయ్. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు లేవు. పలుమార్లు వీరిద్దరి మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. వైసీపీ పెద్దలు ఇరువురి మధ్య రాజీ కూడా చేశారు. అయినా ఇప్పటివరకు అటు మంత్రి రజిని ఇటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల మధ్య మాటలు కూడా లేవనే ప్రచారం ఉంది. తాజాగాఈ ప్రోటోకాల్ వివాదంతో… విభేదాలు బయటపడ్డాయ్. సత్తెనపల్లి ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు ప్రారంభించారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేరు లేకపోవడంతో….ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. శిలాఫలకం పైన తన పేరు లేకపోవడంపై అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రజని.
మరోవైపు మంత్రి విడదల రజనికి చెక్ పెట్టేందుకు రాబోయే ఎన్నికల్లో నందమూరి కుటుంబం నుంచి ఓ అభ్యర్థిని బరిలో దింపే యోచనలో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దివంగత హరికృష్ణ కుమార్తె నందమూరి వెంకట సుహాసిని వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నుండి బరిలో దించాలని భావిస్తున్నారు. అదే జరిగితే రజనీకి మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చు.