Singanamala YCP candidate(AP political news): ఆ నియోజకవర్గాన్ని అన్నిటికంటే వెరీవెరీ స్పెషల్గా భావిస్తుంటాయి అన్ని పార్టీలు.. ఎందుకంటే అక్కడ ఎవరు గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. టీడీపీ ఆవిర్భావం నాటి నుంచి.. నిజంగా అదే జరుగుతూ వస్తోంది. అలాంటి సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించి ప్రయోగాలు చేస్తోంది వైసీపీ.. పక్కన పెట్టిన ఎమ్మెల్యే వర్గానికి చెందిన నేతనే ఇన్చార్జ్గా ప్రకటించింది. అయితే ఆ కొత్త ఇన్చార్జ్కి కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. అక్కడ మరో ట్విస్ట్ చోటుచేసుకోవడం ఖాయమంటోంది ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం.. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో?అక్కడ వైసీపీలో జరుగుతున్న రాజకీయం ఏంటో మీరే చూడండి.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల ఎంపికపై అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతలు మల్లాగుల్లాలు పడుతున్నారు. ఎవరికి వారు గెలుపుగుర్రాలను బరిలో దింపి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేచడానికి కసర్తు చేస్తున్నారు. టీడీపీ, జనసేనలు బీజేపీతో పొత్తుల లెక్కలు తేలక.. ఇంత వరకు అభ్యర్ధులను ప్రకటించలేదు. అయితే వైసీపీ మాత్రం ఆరు లిస్ట్లు రిలీజ్ చేసి.. దాదాపు 80 స్థానాల్లో ఇన్చార్జులను ప్రకటించింది.
ప్రజావ్యతిరేకత, సర్వే రిపోర్టుల పేరుతో పెద్ద ఎత్తున అభ్యర్ధులను మారుస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు.. ఆ క్రమంలోనే అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో వీరాంజనేయులుకి బాధ్యతలు కట్టబెట్టారు. కొత్త ఇన్చార్జ్ నియామకం ఎమ్మెల్యే భర్త, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు అయిన సాంబశివారెడ్డి సిఫార్సుతోనే జరిగింది. దీంతో సింగనమలలో ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం భగ్గుమంటోంది.
వైసీపీలో జొన్నలగడ్డ పద్మావతిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పద్మావతి భర్త సాంబశివారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. పార్టీలో ఎవరినీ ఖాతరు చేయడం లేదని సింగనమల వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ పెద్దలు ఎమ్మెల్యేని పక్కనపెట్టినప్పటికీ.. ఆమె భర్త అనుచరుడికే సమన్వయ బాధ్యతలు అప్పగించడం. అసమ్మతి వర్గం ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లైంది.
అనంతపురంలోని ఓ ఫంక్షన్ హల్లో అసమ్మతి వర్గం నాయకులు పెద్ద మీటింగ్ పెట్టుకుని.. పార్టీలో గుర్తింపు లేని వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడంపై మండిపడ్డారు. శింగనమల నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉందని ముఖ్యమంత్రి జగన్.. దాన్ని దృష్టిలో పెట్టుకుని .. సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. సాంబశివారెడ్డి ప్రతిపాదించే ఏ వ్యక్తికీ తాము సహరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆ సమావేశం మాజీ ఎమ్మెల్యే యామిని బాల అధ్యక్షతన జరగడం విశేషం.
ఆ మీటింగ్కి కార్యకర్తలు భారీగా హాజరవడం తో ఎమ్మెల్యే వర్గం దిక్కుతోచని స్థితిలో పడిందంట. అదలా ఉంటే సింగనమల వైసీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి.. సింగనమల నియోజకవర్గంలోని తన స్వగ్రామానికి వచ్చారు. వచ్చి రాగానే ఆ డిఎస్పీ తన మార్కు రాజకీయం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నాయకులు కలుస్తూ.. తిరిగి ఇన్చార్జ్ని మార్చేలా పావులు కదుపుతున్నారు.
ఆయనకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా మద్దతు పలుకుతున్నారట. కేతిరెడ్డి పెద్దారెడ్డితో సింగనమల ఎమ్మెల్లే వర్గానికి ముందు నుంచి విభేధాలున్నాయి. ఇప్పుడు పెద్దారెడ్డి మద్దతు కూడగట్టుకున్న డీఎస్పీ చేస్తున్న రాజకీయంతో ఎమ్మెల్యే వర్గం లో మరింత టెన్షన్ పెరిగిపోయిందట. ఇటీవల వైసీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించిన ఇన్చార్జిలను మారుస్తుండటం. త్వరలో సింగనమల వైసీపీ ఇన్చార్జి కూడా మారతారన్న ప్రచారంతో పద్మావతి వర్గంలో గుబులు రేగుతోందంట.
ఎమ్మెల్యే వర్గానికి చెందిన వ్యక్తి కాకుండా.. ఎవరిని బరిలోకి దింపినా.. తామంతా కలిసి పనిచేస్తామని.. అటు మాజీ ఎమ్మెల్యే యామిని బాల వర్గం, ఇటు డీఎస్పీ వర్గం చెప్తుండడంతో.. వైసిపి పెద్దలు కూడా ఆలోచనలో పడ్డారంట. అదీకాక అనంపురం జిల్లా ఇన్చార్జి మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సదరు డీఎస్పీ కు మంచి ర్యాపో ఉందంటారు. ఆయన చిత్తూరులో డీఎస్పీగా ఉన్న టైంలో పెద్దిరెడ్డితో ఏర్పడిన సాన్నిహిత్యంతో ఆ యాంగిల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారంట. ప్రస్తుతం తూర్పుగోదావరికి ట్రాన్స్ఫర్ అయిన ఆ డీఎస్పీకి.. అక్కడకు వెళ్లడం ఇష్టం లేదంట. అందుకే లోకల్ పాలిటిక్స్లో సెటిల్ అవ్వాలని పావులు కదుపుతున్నారంట.
మొత్తమ్మీద సింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వర్గానికి సదరు డీఎస్పీ చెక్ పెట్టే పరిస్థితి కనిపిసోందంటున్నారు . మరోవైపు వైసీపీలో ఈ గ్రూపుల గోలతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ఎవరి వర్గంలో ఉండాలో అర్థం కాక తికమకపడిపోతున్నారు. చూడాలి మరి.. ప్రభుత్వ సలహాదారు వర్సెస్ డీఎస్పీల మధ్య టికెట్ వార్లో ఎవరిది పైచేయి అవుతుందో?