ఆమె ఒక ఫైర్ బ్రాండ్. మాటలతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగలరు. గతంలో పనిచేసిన పార్టీతో పేరు తెచ్చుకుని.. ప్రస్తుతమున్న పార్టీలోనూ తమకంటూ ప్రత్యేకత సంతరించుకున్నారు. ఛైర్పర్సన్గా బాధ్యతలు నెరవేరుస్తున్న మహిళా నేతను.. నేరుగా ప్రత్యక్షరాజకీయాల్లోకి దించితే ఎలా ఉంటుందనే భావనలో అధిష్టానం ఉందట. ఇంతకీ ఎవరా నేత.. ఎక్కడ నుంచి పోటికి అవకాశం.
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు జరుగుతోందో తెలియదు. అందులోనూ వైసీపీలో ఇంకా విచిత్రం . రెండ్రోజులుగా.. వైసీపీ వర్గాల్లో వాసిరెడ్డి పద్మ పేరు మార్మోగుతోంది. తాజాగా ఆమెకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. నేడో రేపో ఆమె.. ముఖ్యమంత్రి జగన్ను కూడా కలవనున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమెకు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని.. ఆమె పేరు పరిశీలనలో ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. కీలకమైన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ఆమెను బరిలో నిలుపుతారనే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. పద్మ మాత్రం రాజమండ్రి నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
వాసిరెడ్డి పద్మ.. రాజకీయాలకు కొత్తకాకపోయినా.. ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం కొత్తనే చెప్పాలి. 2009లో రాజకీయ ఆరంగేట్రం చేసిన పద్మ.. అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా వెలుగులోకి వచ్చారు. ఆపార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేశారు. అయితే.. ఆమెకు టికెట్ ఇవ్వలేదు. తర్వాత.. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాక.. కొన్నాళ్లు మౌనంగా ఉన్న పద్మ.. వైసీపీ ఆవిర్భావంతో జగన్ గూటికి చేరారు. పార్టీ అధికార ప్రతినిధిగా చాలా సంవత్సరాలు పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమెకు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ బాధ్యతలను జగన్ కట్టబెట్టారు. పద్మకు..జగన్కు అభిమానిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆటుపోట్లు ఎదురైనా.. తట్టుకుని నిలిచారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పద్మ.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వెస్లీని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆమెను జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ.. ఇది బలమైన నియోజకవర్గం. టీడీపీకి ఒకరకంగా.. కంచుకోట అనే చెప్పాలి. దీంతో పద్మ గెలుపు అవకాశాలపై విశ్లేషణలు మొదలయ్యాయి.
ఒకప్పుడు కాంగ్రెస్కు బలం ఉన్న ఆ స్థానం తర్వాత కాలంలో టీడీపీకి అనుకూలంగా మారింది. గత ఎన్నికల్లో సామినేని ఉదయభాను.. వైసీపీ తరఫున విజయం సాధించారు. ఇప్పుడు ఆయనకు సీటు లేకుండా చేసి.. పద్మకు అవకాశం ఇస్తే.. ఇంటా బయటా కూడా.. నెట్టుకురావడం.. అంత ఈజీ కాదనే అభిప్రాయం ఉంది. ఒకవేళ పద్మకు సీటు ఇచ్చే.. సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని.. ఆమెకు యాంటీగా రాజకీయాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఉదయభానుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పద్మ కి ఇవ్వాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. టీడీపీ నేత.. శ్రీరాంతాతయ్యకు ఇప్పటికే సానుభూతి పవనాలు వీస్తున్నాయి. దీంతో సొంత పార్టీ నుంచి సహకారం కొరవడి.. టీడీపీ దూకుడు పెరిగితే.. పద్మ ఏమేరకు విజయం దక్కించుకుంటారనేది ప్రశ్నార్థకమే.
ఇలాంటి నియోజకవర్గాల్లో మార్పులు మంచిది కాదనేది వైసీపీ నేతల సూచినట్లు తెలుస్తోంది. గతంలోనూ చాలా పార్టీలు మార్పుచేర్పులు చేసినా..ఇప్పుడు వైసీపీ చేసినంత లేదు. దీంతో మార్పులతో పార్టీకి మంచి జరుగుతుందా.. లేక.. కొత్త ఇబ్బందులు తలెత్తుతాయా అనే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. తాను అనుకుంటే ఎలాంటి నిర్ణయాన్ని అయినా.. అమలు చేసే జగన్.. పద్మ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.
.
.