Mylavaram MLA Vasantha Krishna Prasad About CM YS Jagan: మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన సీఎం జగన్ మీద విరుచుకుపడ్డారు. గత నాలుగేళ్లుగా మైలవరం ఎమ్మెల్యేగా అనేక అవమానాలను భరించానని వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను అమలు చేసేందుకు వైసీపీ అధినేత సహకరించలేదని ఆయన తెలిపారు. చొరవ తీసుకుని ప్రజల కోసం అనేక పనులు చేస్తే.. వాటికి బిల్లులు చెల్లించకుండా ఆపేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పైగా.. ఆ పనుల్లో తాను అవినీతికి పాల్పడ్డానని పార్టీ అధినేత ఆరోపించారని తెలిపారు.
35 ఏళ్లుగా తాను నిజాయితీగా జీవిస్తు్న్నానని, తన చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుందే తప్ప ఎవరినీ యాచించి బతికేవాడిని కాదని పరోక్షంగా వైసీపీ అధిష్ఠానానికి చురకలు అంటించారు. వైసీపీ రాజకీయాలతో విసిగి, తిరిగి వ్యాపారం చేసుకునేందుకు వెళ్లిపోవాలని భావించానని, కానీ.. ఇక్కడి పరిస్థితులు చూశాక తాను తన నియోజక వర్గంలోనే ఉండి ఇక్కడి ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
మైలవరం నియోజకవర్గంలో ఆదినుంచి జోగి రమేశ్ జోక్యం చేసుకోవటంపై పార్టీ పెద్దలతో మాట్లాడినా వారు ఏ చర్యలూ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో జోగి వర్గం వెన్నుపోటు రాజకీయాల వల్లే అక్కడ వైసీపీ ఓడిందని తెలిపారు. మంత్రి అయిన తర్వాత జోగి రమేష్ జోక్యం శృతిమించుతుందని మొత్తుకున్నా.. అధిష్ఠానం లైట్ తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతే రాజధాని ఇదేనని నమ్మబలికిని జగన్.. సీఎం కాగానే ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని రాజధానిని నాశనం చేశారన్నారు. ఇటీవల చివరిసారిగా సీఎం జగన్ను కలిసినప్పుడు ‘ నువ్వు చంద్రబాబును తిట్టవు. లోకేష్ను తిట్టవు. ఇలాగైతే నిన్ను నేను ఎలా ఓన్ చేసుకోగలను’ అన్నాడని నేటి బహిరంగసభలో ఆయన వెల్లడించారు. తాను అందరి వాడిననీ, ఎవరినీ వ్యక్తిగతంగా తిట్టి సీటు తెచ్చుకునే వాడిని కాదని, అలాంటి రొచ్చు రాజకీయం తన కుటుంబం ఏనాడూ చేయలేదని, రాజకీయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోబోనని స్పష్టం చేశారు.
కృష్ణ ప్రసాద్కు సీటు ఇస్తానన్నా, ఎన్నికలు ఖర్చు కూడా ఏర్పాటు చేస్తానన్నా మన లైన్లోకి రావటం లేదని సీఎం జగన్.. జిల్లా నేతలతో వ్యాఖ్యానించటం పట్ల ఆయన మండిపడ్డారు. గౌరవ మర్యాదలు లేని చోట తాను రాజకీయం చేయలేనని, కష్టపడి గెలిపించుకున్న కార్యకర్తలు, నాయకులు నష్టపోతుంటే చూస్తూ ఊరుకోలేనని చెప్పుకొచ్చారు. పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు పార్టీలో సముచిత స్థానం ఇస్తానని తాజాగా ఫోన్ చేసి హామీ ఇచ్చినా.. ఇకపై తాను పార్టీలో కొనసాగలేనని తెలిపినట్లు వెల్లడించారు.