Vande Bharat: ఏపీ అంటేనే రాజకీయ కురుక్షేత్రం. ప్రతీ విషయాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తుంటారు. తప్పు దొరికితే చాలు.. విపక్షం చీల్చి చెండాడేస్తుంది. ఓ వర్గం మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే తీరు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీకి పెట్టుబడులు పోటెత్తాయని టీడీపీ పదే పదే చెబుతుంటుంది. జగన్ వచ్చాక ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటూ విమర్శిస్తుంటుంది. వైసీపీ వాళ్ల కౌంటర్లు ఎలానూ ఉండనే ఉంటాయి. కానీ, లేటెస్ట్ గా ఏపీకి సంబంధించిన ఓ న్యూస్ కు అంతగా ప్రచారం రాలేదని అంటున్నారు. అదేంటంటే….
వందే భారత్ రైలు. యావత్ దేశంలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. స్వయంగా ప్రధాని మోదీనే ఆ రైలును ప్రారంభిస్తున్నారు. ఆహా ఓహో అంటూ అంతా కీర్తిస్తున్నారు. అలాంటి వందే భారత్ రైలుకు సంబంధించి కొన్ని విడిభాగాలు ఏపీలోనే తయారు అవుతుండటం ఆసక్తికరం. ప్రచారానికి బాగా స్కోప్ ఉన్న అంశం అయినప్పటికినీ.. ఈ విషయంలో వైసీపీ వెనకబడిందని అంటున్నారు.
శ్రీసిటీ. ఏపీలోని టాప్ సెజ్. ఎప్పుడో వైఎస్సార్ హయాంలో పెట్టారు. చంద్రబాబు జమానాలో డెవలప్ అయింది. తొలినాళ్లలోనే శ్రీసిటీ సెజ్ లో ఏర్పాటైన BFG కంపెనీయే ఇప్పుడు వందే భారత్ రైలు విడిభాగాలను తయారు చేస్తోంది. రైలు కోచ్ లోని ఇంటీరియల్ పనులు, టాయిలెట్ క్యాబిన్, ఇంజిన్ ముందు ఉండే భాగాన్ని ఈ సంస్థే తయారు చేస్తోంది. వందే భారత్ రైళ్లకే కాదు.. చెన్నై, కొచ్చి మెట్రో ప్రాజెక్టులకు సైతం స్పేర్ పార్ట్స్ సరఫరా చేస్తోంది BFG.
శ్రీసిటీలో కొలువై ఉన్న ఈ సంస్థ పలు ప్రముఖ కంపెనీలతో కలిసి పని చేస్తోంది కూడా. ఇండియన్ రైల్వేస్ కు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, కొచ్చిన్ షిప్ యార్డ్, వోల్వో, జనరల్ ఎలక్ట్ట్రికల్, థెర్మాక్స్ లాంటి సంస్థలకు BFG ఇండియా సేవలు అందిస్తుండటం ఏపీకి గర్వకారణం.