Vaikunta Ekadashi: వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. శనివారం నుంచి 10 రోజులపాటు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతివ్వనున్నారు. అయితే ముందుగానే అలిపిరి వద్ద రద్దీ నెలకొంది. టోకెన్లు ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ అధికారులు చెప్పిన సమయం కంటే ఒకరోజు ముందే భక్తులు.. తరలివచ్చారు.
గతేడాది కూడా చెప్పిన సమయం కంటే ముందే టోకెన్లు ఇచ్చేశారని.. అందుకే ఈసారి ఒకరోజు ముందుగానే వచ్చామని భక్తులు చెప్తున్నారు. అధికారుల మాటపై తమకు నమ్మకం లేదని అంటున్నారు. ఏటా ఇలానే చేస్తున్నారని.. టైమ్ ఒకటి చెప్పి.. దానికంటే ముందే టోకెన్లు ఇచ్చేస్తున్నారని అంటున్నారు. ఇదేంటని అడిగితే.. భక్తులు తాకిడిని తట్టుకోలేకే ఇచ్చేసామనే సాకులు చెప్తారని మండిపడుతున్నారు.
ఈసారి కూడా టీటీడీ అధికారులు చెప్పినదానికంటే ముందుగానే టిక్కెట్లు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి టోకెన్స్ ఇష్యూ చేస్తామని ప్రకటించినప్పటికీ భక్తుల తాకిడి పెరిగింది. దీంతో రాత్రి 11 నుంచే టోకెన్లు జారీ చేసేశారు. ఇక ఇప్పటికీ ఏకాదశి, ద్వాదశి సంబంధించిన టోకెన్ల పంపిణీని ప్రారంభించారు.
4 లక్షల 23వేల 500 కోటా పూర్తి అయ్యేవరకు నిరంతరాయంగా టోకన్లు జారీ చేయనున్నారు. టోకన్లు, టిక్కెట్లు కలిగివున్న భక్తులను మాత్రం వైకుంఠద్వార దర్శనానికి అనుమతివ్వనున్నారు. దర్శనం స్లాట్ సమయానికి 24 గంటల ముందు మాత్రమే లోపలికి అనుతిస్తారు. ఇవాళ్టి దర్శనానికి టోకన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. జనవరి 1తో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది.