Fire To Chilli Crop : పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంటలో మిర్చి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. పంట తగలబడటంతో రూ. 2.5 లక్షల ఆస్తి నష్టం కలిగిందని రైతు కన్నీటి పర్యంతమయ్యారు.
పల్లెగుంటలో దీకొండ రమణ మిర్చి పంట సాగు చేశారు. మిర్చిని కల్లంలో ఆరబోసి రాత్రి ఇంటికి వెళ్లారు. ఉదయం వచ్చి చూసే సరికి పంట దగ్ధమైంది. దీంతో ఆ రైతు భావోద్వేగానికి లోనయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించటంతో కల్లంలో ఆరబోసిన 15 క్వింటాళ్ల ఎండు మిర్చి పూర్తిగా కాలి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రి సమయంలో దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని బాధితుడు రమణ అనుమానం వ్యక్తం చేశారు. తనకు తగిన న్యాయం జరిగేలా చూడాలని బాధిత రైతు ప్రభుత్వానికి వేడుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.