AP Political Updates : ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తామని కేంద్రమంత్రి ప్రకటించేశారు. మరి కమలంతో కలిసేందుకు టీడీపీకి సమ్మతమేనా? పవన్ కూడా కోరుకుంటున్నది ఇదేనా? వైసీపీ సవాళ్ల సంగతేంటి?
అందరి టార్గెట్ ఢిల్లీ.. పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది.సార్వత్రిక ఎన్నికలకు గట్టిగా ఏడాది కూడా లేదు. మరోవైపు ముందస్తు ముచ్చట్లూ వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విపక్షాలు అలర్టయ్యాయి. మోదీని ఐక్యంగా ఢీ కొట్టాలని నేతలు మంతనాలు సాగిస్తున్నారు. కర్నాటకలో బీజేపీ ఓడిపోవడం కాంగ్రెస్కు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది. అదే జోష్తో విపక్షాలను కూడగడుతున్నారు రాహుల్గాంధీ. ఈమధ్య ఆయన ఏం చేసినా క్రేజ్ వస్తోందివిపక్షాల ఐక్యతారాగంతో అధికార పార్టీ కూడా అలర్టయినట్టు కనిపిస్తోంది. గతంలో ఎన్డీయే పక్షాలను మరోసారి దగ్గరకు చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. అనంతపురం గడ్డపై కేంద్రమంత్రి నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి.
మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పారు కేంద్రమంత్రి నారాయణ స్వామి. ఆయన మాటల్లోని మిత్రపక్షాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. ఇది తెలుగు రాజకీయాల్లో ఊహించని పరిణామమా? ఊహించిన పరిణామమా? ఇదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏపీ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ, జనసేన-బీజేపీ మధ్య మూడు ముక్కలాట నడుస్తోంది. ముఖ్యమంత్రిగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి అనర్హుడంటూ ఓ రేంజ్లో విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే పదే చెప్తున్నారు. చంద్రబాబు-పవన్ అనూహ్య భేటీలు కూడా వాళ్లిద్దరూ మళ్లీ జట్టు కడుతున్నారనే సంకేతాలు ఇచ్చారు.
చంద్రబాబు హయాంలో అలిపిరి దగ్గర అమిత్షాపై జరిగిన దాడి నేపథ్యంలో మరోసారి టీడీపీని బీజేపీ దగ్గరకు రానియ్యదనే అభిప్రాయం కూడా వినిపించింది. కానీ రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులూ ఉండరనేది జగమెరిగిన సత్యం. బీజేపీకి నమ్మకస్తుడైన మిత్రుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ వీలు కుదిరినప్పుడల్లా టీడీపీతో పొత్తు అవసరాన్ని కమలనాథులకు వివరిస్తూ వచ్చారు. 151 స్థానాలతో బలంగా ఉన్న వైసీపీని ఓడించాలంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని బలంగా చెప్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు అవసరమైతే బీజేపీతో దోస్తీకి గుడ్బై చెప్పి.. చంద్రబాబుతో పవన్ చేతులు కలిపే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలూ వినిపించాయి. దీన్ని గ్రహించే.. సీఎం జగన్ కూడా దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండని బహిరంగ సభల్లో పదేపదే సవాల్ విసిరారు.
ఏపీలో టీడీపీ గెలిచినా, వైసీపీ నెగ్గినా.. బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదని.. ఆ రెండు పార్టీలు అల్టిమేట్గా మోదీకే మద్దతిస్తాయనే సెటైర్లూ ఉన్నాయి. అటు జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కమలనాథులు.. దక్షిణాదిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. చిన్న పొరపాటు కూడా జరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. పవన్ కళ్యాణ్ను సంతృప్తి పరచడం కోసమే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తప్పించారనే వాదన ఉంది. అదే సమయంలో నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీ చీఫ్గా నియమించారు. గతంలో నారా, దగ్గుబాటి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉండేది. గత కొంతకాలంగా సీన్ మారిపోయింది. నారా – దగ్గుబాటి కుటుంబాలు దగ్గరయ్యాయి. దీంతో.. టీడీపీతో పొత్తుకు ఆటంకాలు ఉండకూడదనే పురంధేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిని ఎంపిక చేశారనే వాదన కూడా ఉంది. వీటన్నిటికీ బలం చేకూరుస్తున్నాయి కేంద్రమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యలు. సో, టీడీపీ-బీజేపీ-జనసేన కలిసొస్తే.. వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.