Chandrababu – Modi: ఏపీకి కేంద్రం తాజాగా రైల్వే లైన్ కు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర కేబినెట్ భేటి అనంతరం రాష్ట్రానికి కొత్త రైల్వే లైనుకు సంబంధించి ప్రకటన జారీ చేయడంపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక చొరవతో అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్ మంజూరయిందని, అలాగే రాజధాని అమరావతి అభివృద్ది వైపు నడిచేందుకు ఈ రైల్వే లైన్ దోహద పడుతుందని సీఎం చెప్పారు.
కేంద్రం ప్రకటన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు రూ.2245 కోట్లు ఖర్చవుతుందని, మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు లింక్ చేస్తూ ఈ లైన్ ఏర్పడుతుందన్నారు. అంతేకాకుండా టెంపుల్ టూరిజం డెవలప్ చేసేలా రైలు కనెక్టివిటీ ఉంటుందని, శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం, అమరావతి స్తూపం, బుద్ధ విగ్రహం, ఉండవల్లి గుహలను కలిపేలా రైల్వే లైన్ సౌకర్యం కల్పించడం పర్యాటక రంగానికి మళ్లీ ఊతమిచ్చే గొప్ప అవకాశమని సీఎం అన్నారు.
కొత్త రైల్వే లైన్లో దేశంలోని ఇతర రాష్ట్ర రాజధానులైన హైదరాబాద్, చెన్నె, కోల్కతాలను అనుసంధానం చేస్తుందని తెలిపారు. కృష్ణా నది పై వస్తున్న కొత్త రైల్వే బ్రిడ్జిని ఒక ఐకానిక్ బ్రిడ్జిగా తీర్చి దిద్దాలని, రైల్వే మంత్రిని కోరుతున్నట్లు సీఎం తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపున కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర అభివృద్దికి కేంద్రం అందిస్తున్న సహకారం ఎప్పటికీ మరువలేనిదన్నారు.
కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయంలోనే వరదలు భీభత్సం సృష్టించాయి. దీనితో విజయవాడ నగరం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం స్పందించిన తీరు అమోఘం. వరద సాయం కోసం కేంద్రం రూ.1036 కోట్ల నిధులను సైతం అందించింది. ఇలా కేంద్రం నిధుల పరంగా రాష్ట్రాన్ని ఆదుకోవడమే కాక, హెలికాప్టర్స్, సైన్యాన్ని సైతం పంపింది.
అంతేకాకుండా కూటమి ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు ప్రజలకు అభయహస్తం అందించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ప్రత్యేక చొరవ చూపి, బుడగమేరు గండిని పూడ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా వరదసాయాన్నిసైతం భాదితుల ఖాతాలో జమ చేసి, ప్రభుత్వం ఆదుకుంది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ అభివృద్దికి సైతం రూ. 3వేల కోట్లకు పైగా నిధులు ఇవ్వనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.
ఇలా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో, అభివృద్ది పథం వైపు నడిపించడంలో కేంద్రం అందిస్తున్న సాయం పట్ల సీఎంతో పాటు, రాష్ట్ర మంత్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం కేంద్రం కొత్త రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మరో తీపి కబురు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించింది. రూ. 252.42 కోట్లతో మంజూరు చేసినట్లు ట్విట్టర్ వేదికగా గడ్కరీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పలుచోట్ల ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు రహదారి భద్రత కూడా పెరుగుతుందన్నారు. ఆర్థిక, సామాజిక అవకశాలు పెరగడం, ఉపాధి కూడా లభిస్తుందని ట్వీట్ రూపంలో కేంద్రమంత్రి స్పష్టం చేశారు.