Undi Constituency Ticket War : లాంఛనం పూర్తైంది. నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజకీయ పయనం ఎటో తేలిపోయింది. చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. ఉండి ఎమ్మెల్యేగా పోటీకి సిద్దమయ్యారు. నరసాపురం ఎంపీగానే పోటీలో ఉంటానన్న ఆర్ఆర్ఆర్.. పొత్తుల ఈక్వేషన్లు కుదరక ఉండికి దిగివచ్చారు. దాంతో ఇప్పటికే ఉండి టికెట్ దక్కించుకున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు లబోదిబోమంటున్నారంట.
నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పొలిటికల్ జర్నీపై క్లారిటీ వచ్చేసింది. వైసీపీపై యుద్దం ప్రకటించిన ఆయన ఎన్నికల సీజన్ వచ్చినా ఇంతవరకు ఏ పార్టీలో చేరతారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుత ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు తిరిగి నర్సాపురం పార్లమెంట్ లోనే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మిత్రపక్షాల అభ్యర్ధిగా తానే బరిలో ఉంటానని తాడేపల్లిగూడెం ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్కళ్యాణ్ల సమక్షంలోనే ధీమాగా ప్రకటించారాయన.
సీన్ కట్ చేస్తే నరసాపురం ఎంపీ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. అక్కడ అభ్యర్ధిగా శ్రీనివాసవర్మను ప్రకటించారు కాషాయపెద్దలు. దాంతో ఆర్ఆర్ఆర్ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడినట్లు కనిపించింది. ఆ క్రమంలో ఆయనకు పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
Also Read : చీలిన వైఎస్ కుటుంబం.. కడప గడపలో న్యాయపోరాటం
చేరిక లాంఛనం పూర్తవ్వడంతో రఘురామరాజు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది అసక్తికరంగా మారింది. కూటమి తరపున నరసాపురం నుంచి తన పోటీ పక్కా అని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారాయన. నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ పేరు ప్రకటించారు కమలనాథులు. భీమవరానికి చెందిన శ్రీనివాసవర్మ ఎవరో లోక్సభ స్థానంలోని మిగిలిన అసెంబ్లీ నియోజకర్గాలకు పెద్దగా పరిచయం లేదంటున్నారు. భీమవరంలో కూడా మిత్రపక్షాల శ్రేణులు ఆయనకు పూర్తిస్థాయిలో సహకరించడం లేదంటున్నారు.
ఆ లెక్కలతో సీట్ల సర్దుబాటులో ఈక్వేషన్లు మారతాయన్న టాక్ వినిపిస్తోంది. నరసాపురం ఎంపీ స్థానాన్ని టీడీపీ తీసుకుని.. ఏలూరు లోక్సభ సెగ్మెంట్ను బీజేపీకి కేటాయించే అవకాశం ఉందంటున్నారు. నరసాపురంలో రఘురామరాజే కరెక్ట్ కేండెట్ అని, ఆయన ఎంపీగా బరిలోకి దిగితే అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ప్రభావం చూపించగలుగుతారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అటు ఏలూరులో టీడీపీ ఇప్పటికే ఎంపీ అభ్యర్ధిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ను సీమ నుంచి ఏలూరుకు ఇంపోర్ట్ చేశారు. దాంతో అక్కడి టికెట్ ఆశావహులు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. మొదటి నుండి సీటు ఆశిస్తున్న మాజీ ఎంపీ మాగంటి బాబు అలకపాన్పు ఎక్కారు. టికెట్ ఆశించిన మరో నేత గోరుముచ్చు గోపాల్యాదవ్ ఓవర్ నైట్ వైసీపీ కండువా కప్పేసుకున్నారు.
Also Read : సోమిరెడ్డి కాకాణికి కష్టమేనా?
మొదట్లో ఏలూరు సీటు బీజేపీకి కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. దాంతో ఏలూరు బీజేపీ కన్వీనర్గా వ్యవహరిస్తున్న గారపాటి సీతారామాంజనేయ చౌదరి పోటీకి సిద్దమయ్యారు. గడిచిన 15 ఏళ్లుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు పరిధిలో తపన చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తపన చౌదరిగా సుపరిచితులయ్యారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత అయిన ఆయనకు ప్రజల్లోనూ మంచి పలుకబడి ఉంది. ఇప్పుడాయన స్వతంత్ర అభ్యర్థిగా బారిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఏలూరు బీజేపీకి కేటాయిస్తే తలనొప్పి వదులుందన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారంట. నరసాపురం, ఏలూరు ఎంపీ సీట్లు పరస్పరం మార్చుకుంటే.. ఇటు రఘురామరాజుకి, అటు తపనాచౌదరికి లైన్ క్లియర్ అవుతుందని.. అసంసృప్తుల సెగ కూడా తప్పుతుందని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు చెప్తున్నారు.
అయితే అదే సమయంలో లోక్సభ సెగ్మెంట్లపై ఈక్వేషన్లు కుదరకపోతే రఘురామకృష్ణరాజు అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. ఆయన్ని ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దమయ్యారన్న టాక్ వినిపించింది. చివరికి అదే నిజమైంది. ఇప్పటికే ఉండి స్థానానికి ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉండి నుంచీ టీడీపీ తరుఫున మరోసారి పోటీ చేస్తారని.. ఫస్ట్ లిస్టులోనే ప్రకటించారు చంద్రబాబు.. అయితే ఇప్పుడు అభ్యర్ధిని మార్చేశారు.. గత ఎన్నికల్లో ఎదురుగాలిలోనూ గెలిచిన రామరాజును పక్కనపెట్టి.. ఆర్ఆర్ఆర్ని ఉండి అభ్యర్ధిగా ప్రకటించారు టీడీపీ అధినేత.. దాంతో ఇప్పుడు మంతెన రాజు లబోదిబోమంటున్నారంట. మరి ఇప్పుడు ఏలూరు, నరసాపురం ఎంపీ స్థానాల్లో పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారో చూడాలి.