నేటి సమాజంలో బంధాలు, అనుబంధాలకు విలువ ఉందా.. అనే రీతిలో కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. మానవత్వం అనే భావన కూడా లేని పరిస్థితుల్లో కొందరు మానవ మృగాలుగా మారి, దారుణాలకు పాల్పడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. అటువంటి ఘటనే తాజాగా నంద్యాల జిల్లా నాగటూరు గ్రామంలో చోటుచేసుకుంది. తండ్రి లాంటి వయస్సు గల ఓ వ్యక్తి, ఏకంగా తన కోడలిపైనే కన్నేశాడు. చివరకు దారుణ హత్యకు సైతం పాల్పడ్డాడు. ఇంతటి దారుణమైన ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది.
అసలేం జరిగిందంటే…
నంద్యాల జిల్లా నాగటూరు గ్రామానికి చెందిన 51 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇక వివరాలోకి వెళితే.. తన కోడలిపై కన్నేసిన మామ తగిన సమయం కోసం వేచి చూసేవాడు. ఈ విషయాన్ని గ్రహించని కోడలు అతడిని తండ్రి సమానంగా భావించి గౌరవించేది. అయితే పొలంలో కంకులను ఏరి వేసేందుకు వచ్చిన కోడలు ఒంటరిగా ఉండడాన్ని మామ గమనించాడు. ఇదే తగిన సమయం అనుకున్నాడు. ఒక్కసారిగా అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఏమి జరుగుతుందో తెలియని స్థితి ఆ కోడలు భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేసింది.
చుట్టుపక్కల వారు ఎవరూ లేకపోవడంతో.. మామ బారి నుండి రక్షింపబడేందుకు ప్రయత్నించింది. అంతలోనే సహనం కోల్పోయిన కురుమన్న అతికిరాతకంగా బండరాయితో కోడలి ముఖంపై బాదాడు. ఇక అంతే తీవ్ర రక్తస్రావంతో కోడలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం స్థానికులకు తెలియడంతో మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు.
అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోడలంటే కూతురిలా భావించాల్సిన మామ.. కోడలి పైనే కన్నేసి అత్యాచారయత్నానికి పాల్పడడం, నిరాకరించడంతో హత్యకు పాల్పడడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే ఇద్దరు చిన్నపిల్లలు సంతానం గల మహిళ మృతి చెందడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. నిందితుడిని పట్టుకుని చట్టరీత్యా కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇటువంటి దారుణాలకు పాల్పడే వారితో సభ్యసమాజంలో బంధాలు, అనుబంధాలకు విలువ లేకుండా పోయిందని, ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమంటూ మహిళా సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి. మహిళలపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, కఠిన చట్టాలు అమలు చేయాలని వారు కోరుతున్నారు.