Janasena: జనసేన పార్టీ మార్చి 14న 10వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. పార్టీ ఆవిర్భావ వేడుకను మచిలీపట్నంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే మంగళగిరికి చేరుకున్నారు జనసేనాని. తాను యుద్ధానికి సిద్ధమని.. జనసైనికులారా సిద్ధమా అంటూ ట్వీట్ చేసి పార్టీ శ్రేణుల్లో కదనోత్సవాన్ని నింపారు. మరోవైపు బీసీ సదస్సును ఏర్పాటు చేసి వారి ఓట్లపై దృష్టి పెట్టారు. ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో పవన్ గేర్ మార్చారు. దూకుడుగా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
అటు జనసేన పార్టీకి నాయకుల లోటు బాగా ఉంది. చెప్పుకోదగ్గ నేతలు పట్టుమని 10 మంది కూడా లేరనేది బహిరంగ రహస్యమే. అందుకే జనసేనాని పార్టీ బలోపేతం ప్రత్యేకదృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను జనసేనలో చేర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు జనసేన కండువా కప్పుకున్నారు. భీమిలికి చెందిన వైసీపీ నేతలు శ్రీచంద్రరావు, దివాకర్ కూడా పవన్ సమక్షంలో పార్టీలో చేరారు.
టీవీ రామారావు 2009లో కొవ్వూరు నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019ల్లో టికెట్ రాకపోవడంతో గత ఎన్నికల్లో వైసీపీ చేరారు. ఆ పార్టీలో తగిన గుర్తింపు లభించలేదంటూ ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరులో పార్టీ అభ్యర్థి తానేటి వనితని గెలిపిస్తే మంచి పదవి ఇస్తానని సీఎం జగన్ అప్పట్లో హామీ ఇచ్చారని తర్వాత కనీసం ఆయనను కలిసే అవకాశం కూడా రాలేదని రామారావు ఆరోపించారు. పార్టీ పదవి అయినా ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. దీంతో తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోతున్నానని అందుకే వైసీపీని వీడి జనసేనలో చేరినట్లు రామారావు తెలిపారు.
ఈదర హరిబాబు 1994లో టీడీపీ తరఫున ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో జడ్పీ ఛైర్మన్గానూ పనిచేశారు. అయితే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈదర హరిబాబు జనసేనలో చేరడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేత జనసేనలోకి రావడం ఆసక్తిని రేపుతోంది.
FOR MORE UPDATES PLEASE FOLLOW :https://bigtvlive.com/andhra-pradesh