Two Died in Boiler explosion in NTR District: ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఇందుకు సంబంధించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా నివాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు.
క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంఓ అధికారులతో మాట్లాడి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని.. అదేవిధంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడడంతోపాటు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు.
Also Read: పోలవరం ముంపు గ్రామాలన్నీ ఏపీవే: చలసాని శ్రీనివాస్
ఈ ఘటనలో ఇద్దరు మృతి
ఎన్టీఆర్ జిల్లా బోదవాడలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో బాయిలర్ పేలి 16 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని విజయవాడలోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మృతిచెందినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ సృజన పరామర్శించారు. మరో ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం.