Viveka: ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ హత్య కేసులో ఏ-4 నిందితుడు దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని ఆయన సవాల్ చేశారు. వివేకా హత్య కేసులో ఏ-4 నిందితుడైన దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా తమను ఇరికించడం సరైంది కాదంటున్నారు భాస్కర్రెడ్డి. దస్తగిరి అప్రూవర్గా మారడంపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. కేవలం సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నాడనేది ఆయన ఆరోపణ.
వివేకా హత్యలో దస్తగిరిదే కీలక పాత్ర అని.. దస్తగిరికి బెయిల్ ఇవ్వడాన్ని భాస్కర్రెడ్డి తప్పు పట్టారు. వివేకాను చంపడానికి ఆయుధాన్ని కొనుగోలు చేసింది కూడా దస్తగిరే అని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దస్తగిరికి బెయిల్ రావడం వెనుక సీబీఐ హస్తం ఉందన్నారు. అయితే ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది చూడాలి. కేసు కీలక దశకు వచ్చిన సమయంలో వైఎస్ అవినాష్, ఆయన తండ్రి భాస్కర్రెడ్డి వరుస పిటిషన్లు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
మరోవైపు వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. సీబీఐ విచారణకు నిందితుడు ఎర్రగంగిరెడ్డి హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తునకు స్పెషల్ సిట్ వేసింది సీబీఐ. సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వికాస్సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కేసులో ఏ-1గా గంగిరెడ్డి, ఏ-2గా సునీల్యాదవ్, ఏ-3గా ఉమాశంకర్రెడ్డి, ఏ-4గా దస్తగిరి, ఏ-5 దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఉన్నారు. దస్తగిరి ఇప్పటికే అప్రూవర్ గా మారారు. ఎర్రగంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలని.. ఇప్పటికే తెలంగాణ హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. గత విచారణలోనే నిందితుడు ఎర్రగంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.