Vishaka Steel: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ. రాజకీయ దుమారం రేపుతున్న అంశం. కేసీఆర్ ఎంట్రీతో మరింత వేడెక్కింది. ఈలోగా కేంద్రం వెనక్కితగ్గినట్టు ప్రకటన చేసింది. అంతలోనే తూచ్ అంటూ మళ్లీ మొదటికి తీసుకొచ్చింది. ఇక ఈవోఐ బిడ్ దాఖలుకు ఏప్రిల్ 15తో గడువు ముగుస్తోంది. సింగరేణి తరఫున బిడ్ వేయించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
అటు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరో ట్విస్ట్ ఇచ్చారు. విశాఖ స్టీల్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు. జనం తరఫున తానే బిడ్ వేస్తానంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రైవేటీకరణే మీ విధానమైతే.. ప్రజలెలా తిప్పికొడతారో చూపిస్తామంటూ లక్ష్మీనారాయణ సవాల్ చేశారు.
మరోవైపు, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై నిరసన తెలుపుతూ..కార్మికులు మహాపాదయాత్ర చేపట్టారు. కూర్మన్నపాలెం నుంచి సింహాచలం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఉక్కు కార్మికులు, వారి కుటుంబసభ్యులు, నిర్వాసితులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఈ పాదయాత్రలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు.