Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ శ్రీనివాసుడి దర్శనభాగ్యంతో భక్తి పారవశ్యంలో భక్తులు పరవశించి పోతుంటారు. గోవిందా నామస్మరణను భక్తిశ్రద్దలతో పఠిస్తే చాలు.. ఆ స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది. అటువంటి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. స్వామివారిని దర్శించిన భక్తులు, లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావించి.. నిశ్చలమైన భక్తితో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. శ్రీవారి సేవలో భక్తులు తరిస్తే.. భక్తుల సేవలో టీటీడీ నిరంతరం తరిస్తోంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం ఎన్ని గంటల సమయం పడుతుంది? తాజాగా ఎందరు భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారో తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వస్తుంటారు. అంతేకాదు విదేశాల నుండి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు రావడం పరిపాటి. అందుకే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ నిరంతరం కృషి చేస్తోంది. స్వామివారి దర్శనంకై ఎందరో భక్తులు సుదూర ప్రాంతాల నుండి పాదయాత్ర ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అంతేకాదు అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గం నుండి కాలినడకన నిర్మలకు చేరుకుంటారు భక్తులు. కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ.
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 64359 మంది భక్తులు దర్శించుకోగా.. 20711 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.59 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
30న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబర్ 30వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆలయంలో అక్టోబర్ 31వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ వస్తోందన్నారు.
ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారని, ఉదయం 7 నుండి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందన్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారని టీటీడీ ప్రకటించింది. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఈవో శ్యామలరావు కోరారు.