Tirumala: తిరుమలలో నేటితో వైకుంఠద్వార దర్శనం ముగియనుంది. ఇవాళ రాత్రి ఏకాంతసేవతో శాస్త్రోక్తంగా ముగించనున్నారు. తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనం కల్పించారు టీటీడీ అధికారులు. దీంతో స్వామి వారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. డిసెంబర్ 23 నుంచి 10 రోజులపాటు ప్రారంభంకాగా నిత్యం 60 వేల నుంచి 80 వేల మంది భక్తుల దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు సర్వదర్శనాన్ని రద్దు చేసి, దాదాపు 8 లక్షల మందికి పైగా ప్రత్యేక ఉచిత టోకెన్లు పంపిణీ చేసి ఉత్తర ద్వారదర్శనానికి ఏర్పాట్లు చేశారు.
ఇవాళ న్యూ ఇయర్ కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. రాత్రి నుంచే కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శారదాపీఠం ఉత్తరాధికారి సాత్మానంద సరస్వతి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం, ఏపీ లోకాయుక్త జడ్జి లక్ష్మణ్ రెడ్డి, మినిస్టర్ మేరుగు నాగార్జున, తమిళనాడు మంత్రి గాంధీ, హీరో సుమన్తో సహా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మరోవైపు రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. రేపు ఉదయం 4గంటల నుంచి టోకెన్లు మంజూరు చేయనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయి.