Tirumala: ఏపీకి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. జిల్లా కలెక్టర్ లను అప్రమత్తం చేశారు. పలు జిల్లాలలో జోరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే తుఫాన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే పలు జిల్లాలలో పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. కానీ దసరా సంధర్భంగా స్వగ్రామాలకు వెళ్లిన వారు మాత్రం.. తిరుగు ప్రయాణం కాగా.. వర్షం ధాటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది.
తాజాగా తుఫాన్ ఎఫెక్ట్ కలియుగ వైకుంఠం తిరుమలకు కూడా తాకింది. దీనితో టీటీడీ అధికారులు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. తిరుమలకు వాతావరణశాఖ భారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించి 15వ తేది మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులను టీటీడీ ఈవో విజ్ఞప్తి చేశారు.
కాగా భారీ వర్షం ధాటికి తిరుమల రహదారి వెంట కొండచరియలు విరిగిపడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే టీటీడీ పూర్తి స్థాయిలో అప్రమత్తమై.. అలాంటి ఘటనలు ఎక్కడ జరిగే అవకాశం ఉందో గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. తిరుమలకు వచ్చే భక్తులకు వర్షం కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. టీటీడీ పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. కాగా భక్తులు వర్షాల కారణంగా ఎక్కడైనా వాగులు, వంకలు ప్రవహించే ప్రదేశాల వద్ద జాగ్రత్త వహించాలని ఈవో కోరారు.
Also Read: Lakshmi Puja 2024: లక్ష్మీదేవి మంత్రం జపిస్తే మీ జీవితాన్ని సమృద్ధిగా డబ్బుతో నింపుతుంది
ఇక,
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 28 నుండి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. పవిత్రోత్సవాలలో భాగంగా అక్టోబరు 27వ తేదీన ఉదయం 9 గంటలకు ఆచార్య రుత్విక్వరణం, సాయంత్రం 6 గంటలకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 28వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6.30 గంటలకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నట్లు తెలిపారు.
రెండో రోజు అక్టోబరు 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ చేస్తారని, చివరిరోజు అక్టోబరు 30వ తేదీ రాత్రి 7 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయన్నారు. పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.