తిరుమల నడకదారిలో చిరుతల నుంచి రక్షణ టీటీడీ కర్రలు పంపిణీ చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల చేతిలో కర్రలను చూసి చిరుతలు భయపడతాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి. సరైన పరిష్కారంపై టీటీడీ దృష్టిపెట్టడంలేదని భక్తులు మండిపడుతున్నారు. ఏదో తూతూ మంత్రంలా భక్తుల చేతికి కర్రలు ఇస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అలిపిరి నడకమార్గంలో టీటీడీ చేపట్టిన కర్రల పంపిణీపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా స్పందించారు. అటవీశాఖ అధికారుల సూచనతోనే భక్తులు కర్రలు ఇస్తున్నామని తెలిపారు. భక్తుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని ప్రకటించారు. మరిన్ని చిరుతలు బంధించేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రాంతాన్ని భూమన కరుణాకర్రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఇది మగ చిరుతని తెలిపారు. ఈ చిరుత వయస్సు ఐదేళ్లు ఉంటుందని వివరించారు. ఎస్వీ జూ పార్క్ నుంచి చిరుతలు తెచ్చి వదులుతున్నారన్న ప్రచారాన్ని ధర్మారెడ్డి ఖండించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తప్పుపట్టారు. చిరుత సంచారంపై నిఘా కోసం కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలుగుబంట్ల కదలికలపై నిఘా పెట్టామని చెప్పారు. డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
పట్టుబడ్డ చిరుతకు జూపార్క్లో పరీక్షలు నిర్వహిస్తామని సీసీఎఫ్ నాగేశ్వరరావు తెలిపారు. చిన్నారిపై దాడి చేసిన చిరుత ఏదో గుర్తించాలన్నారు. బాలికపై దాడి చేసిన చిరుతను జూపార్క్లో ఉంచుతామని ప్రకటించారు. మరో చిరుతను ఎక్కడ ఉంచాలో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. చిరుతలను ట్రాప్ చేయడానికి మరో ఆరు బోన్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. నడక దారిలో ఏర్పాటు చేసిన కెమెరాలను రోజూ పరిశీలిస్తున్నామన్నారు. క్రూర మృగాలు సంచారం ఉన్న ప్రాంతాల్లో ట్రాప్ కేజ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎలుగుబంటి కదలికలు గుర్తించామని వివరించారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.