TTD : నో ఫ్లై జోన్ గా ఉన్న తిరుమలలో డ్రోన్ కెమెరా ఎగిరింది. శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని పై నుంచి వీడియో తీశారు. ఆ దృశ్యాలను ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పెనుదుమారం రేగింది. ఈ నేపథ్యంలో తిరుమల డ్రోన్ కెమెరా దృశ్యాల ఘటనపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ రంగంలోకి దిగింది.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ ఘటనపై స్పందించారు. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాల ఇన్స్టాగ్రామ్ రీల్ ను హైదరాబాద్కు చెందిన సంస్థ సోషల్ మీడియాలో ప్రసారం చేసినట్లు గుర్తించామని వెల్లడించారు. ఆ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు పెడతామని స్పష్టంచేశారు. పటిష్ఠ భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్తో చిత్రీకరించేందుకు అవకాశం లేదన్నారు. పాత చిత్రంతో యానిమేట్ చేశారా? అనే కోణంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించామని సుబ్బారెడ్డి చెప్పారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందిలేదన్నారు.
ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి వీలులేదు. అయితే బీడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పశ్చిమ మాఢవీధి వరకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. శ్రీవారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురాలకు దగ్గరగా వీడియో తీశారు. నో ఫ్లై జోన్గా ఉన్న తిరుమలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో విమర్శలు వస్తున్నాయి. ఆలయ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ తిరుమలలో భద్రతా వైఫల్యంపై విమర్శలు వచ్చాయి.