World Tribal Day : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా గిరిజనులు 4 కిలోమీటర్ల డోలి యాత్ర చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ 5 గ్రామాలకు చెందిన ఆదివాసీలు యాత్ర నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ నీలబండ వద్ద ప్రారంభమైన డోలి యాత్ర.. పిత్రిగెడ్డ, పెదగరువు గ్రామాల మీదుగా జాజులబండ వద్ద ముగిసింది.
ఆర్ల నుంచి పెద్దగరువు, పిత్రుగెడ్డ, జాజులబంద వంటి కొండ శిఖర గ్రామాలకు తక్షణమే రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో ST కోందు తెగకు చెందిన సుమారు 300 మంది ఆదివాసీ గిరిజనులు కొండపైనే జీవనం సాగిస్తున్నారు. 2020లో ఒక్కో ఇంటికి 10వేల చొప్పున చందాలు పోగు చేసుకుని 7 లక్షల సొంత ఖర్చుతో ఆదివాసీలే రోడ్డు నిర్మించుకున్నారు. అయితే వర్షాకాలం నేపథ్యంలో ఆ రోడ్డు కాస్త కొట్టుకుపోయింది. జ్వరాల బారిన పడితే కిలోమీటర్ల మేర రోగుల్ని డోలీల్లో మోసుకుంటూ ఆస్పత్రులకు తీసుకు వెళ్లాల్సి వస్తోంది.
ఇటీవల కుంబర్ల గ్రామానికి చెందిన రోజా అనే మహిళ.. అత్యవసర వేళ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఇదే విధంగా ఎంతో మంది సరైన సదుపాయాలు లేక మన్యం ఒడిలోనే కన్నుమూస్తున్నారు. కడుపులో ఉండే శిశువు నుంచి పండు ముదుసలి వరకు అందరూ కావాల్సిన సౌకర్యాలు లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. దీంతో భారీ సంఖ్యలో గిరిజనులు ‘పాలకులరా ..ఎన్నాళ్లీ డోలీ మోతలు’ అంటూ నినాదాలతో డోలీయాత్ర నిర్వహించారు.