Kadapa Crime: ఏపీలో మిగ్ జాం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. భారీ, అతిభారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు నేలకొరిగి, నీటమునగడంతో రైతన్నకు మళ్లీ అపార నష్టం వాటిల్లింది. చెట్లు నేలకొరిగి, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నానికి బాపట్ల వద్ద తీరం దాటుతుందని, ఆ సమయంలో తుపాను బీభత్సం సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు.
తుపాను బీభత్సానికి ఒక కానిస్టేబుల్ ప్రాణం కోల్పోయాడు. వైఎస్సార్ కడప జిల్లా భాకరాపేటలో విధులు నిర్వహిస్తున్నట్లు కానిస్టేబుల్ పై చెట్టు విరిగిపడి దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. భాకరాపేట సమీపంలో మలినేనిపట్నం వద్ద కానిస్టేబుల్ సత్యకుమార్ బైక్ పై వెళ్తున్నాడు. ఒకవైపు భారీ వర్షం.. మరోవైపు ఈదురుగాలులు.. అదే సమయంలో సత్యకుమార్ పై చెట్టు విరిగిపడింది. దాంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
సత్యకుమార్ 2004వ బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ గా గుర్తించారు. సత్యకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సత్యకుమార్ అకాల మరణంతో.. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.