ఒడిశాలోని బాలాసోర్లో రైలు ప్రమాదం జరిగి ఆరు నెలలు కూడా కాలేదు. దాదాపు 300 మందిని పొట్టన పెట్టుకున్న ఈ ప్రమాదం నుంచి రైల్వే అధికారులు నేర్చుకున్నది ఏం లేదని తెలుస్తోంది. ఎందుకంటే అప్పుడు జరిగిన బాలాసోర్ ప్రమాదానికి.. నిన్న విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదానికి చాలా పోలికలు ఉన్నాయి. అక్కడా.. ఇక్కడా.. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు, అధికారుల అలసత్వమే ప్రమాదానికి అసలు కారణంగా కనిపిస్తోంది.
ఒక్కసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళితే హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో లూప్ లైన్లోకి ప్రవేశించింది. పొరపాటును గమనించి ఆ వెనువెంటనే సిగ్నల్ను ఉపసంహరించుకున్నప్పటికీ అప్పటికే ట్రైన్ లూప్ లైన్లోకి ప్రవేశించింది. ఫలితంగా అదే లైన్లో ఆగివున్న గూడ్స్ రైలుని కోరమండల్ వేగంగా ఢీకొట్టింది. ఈ తీవ్రత ధాటికి కోరమండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 21 కోచ్లు, బెంగళూరు-సూపర్ఫాస్ట్కు చెందిన 2 కోచ్లు రైళ్ల నుంచి విడిపోయి పక్క లైన్లో పడ్డాయి. సరిగ్గా ఇదేసమయంలో ఈ లైన్లో వెళ్తున్న బెంగళూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రాక్పై ఉన్న కోచ్లను బలంగా ఢీకొట్టింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న రైళ్లు ఢీకొట్టుకోవడంతో బోగీలు గాల్లో ఎగిరి పడ్డాయి. దీనంతటికి కారణం సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం అని ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ చార్జ్షీట్లో తెలిపింది.
ఆదివారం సాయంత్రం కూడా విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ సిగ్నల్ లేకపోవడంతో భీమాలి సమీపంలో అత్యంత నెమ్మదిగా వెళ్తోంది. ఇంతలో వెనుక నుంచి విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో పలాస ప్యాసింజర్కు చెందిన గార్డ్ బోగీ ఎగిరి దూరంగా పడింది. దానికి ముందున్న రెండు బోగీలు పక్కకు ఒరిగి, అవతలి ట్రాక్పై బొగ్గు లోడ్తో ఉన్న గూడ్స్ రైలు ఇంజిన్ను ఢీకొని నుజ్జునుజ్జయ్యాయి. రాయగడ ప్యాసింజర్ ఇంజిన్ పూర్తిగా ధ్వంసమైంది. దాని రెండు బోగీలూ పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 12 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.
నిజానికి కంటకపల్లి వద్ద నిన్న ఉదయం నుంచి సిగ్నలింగ్లో సమస్య ఉన్నట్లు రైల్వేవర్గాలు చెబుతున్నాయి. దాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నా పూర్తిస్థాయిలో సమస్య సాల్వ్ కాలేదని సమాచారం. అందుకే కంటకపల్లి దాటాక విశాఖ-పలాస ప్యాసింజర్కు సిగ్నల్ సరిగా లేక దాదాపు ఆగిపోయి ఉంది. ఆ సమయంలో కంటకపల్లి వద్ద ఆగిపోవాల్సిన విశాఖ-రాయగడ ప్యాసింజర్.. వేగంగా ముందుకెళ్లిపోయిందని, అక్కడ ఆగిన పలాస ప్యాసింజర్ను ఢీకొందని తెలుస్తోంది.
అసలు ఓ రైలు ఒక స్టేషన్ నుంచి వెళ్లి, తర్వాత స్టేషన్ దాటేవరకు.. వెనక వచ్చే రైలుకు సిగ్నల్ ఇవ్వరు. ఇది రైల్వేలో ఉన్న రూల్. నిన్న కంటకపల్లి దాటివెళ్లి కొంత దూరం వెళ్లాక భీమాలి సమీపంలో పలాస ప్యాసింజర్ ఆగిపోయింది. అది తర్వాత స్టేషన్ అయిన అలమండకు చేరలేదు. దీంతో వెనుక వస్తున్న రాయగడ ప్యాసింజర్ కంటకపల్లి స్టేషన్ వద్ద ఆగాలి. కానీ ఆగకుండా ఎలా ముందుకు వెళ్లిందనేది ఇప్పుడు ఆన్సర్ లేని క్వశ్చన్. సిగ్నలింగ్ వ్యవస్థలో వైఫల్యాలుంటే రైళ్లు 15 కిలో మీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాలి. కానీ రాయగడ ప్యాసింజర్ అధిక వేగంతో దూసుకొచ్చింది. ఇది కూడా ఎలా జరిగింది? అనేది ఇప్పుడు తెలాల్సి వచ్చింది.
బాలాసోర్లాగానే నిన్నటి రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమా? సిగ్నలింగ్ను పర్యవేక్షించకపోవడం.. లోపాలున్నా సరిచేయకపోవడమే ప్రజల ప్రాణాలు తీసిందా? ప్రస్తుతం ఇవన్నీ ప్రశ్నలే.. వీటికి అధికారుల నుంచి సమాధానాలు రావాల్సి ఉంది.
.
.