Kakinada : ఆమె పేరు అనపర్తి వీరవెంకట కనకదుర్గ అఖిల. కాకినాడ జిల్లా అన్నవరం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వహించేవారు. ఆమె గత శనివారం పదో తరగతి చివరి పరీక్ష విధులకు హాజరై తిరిగి వస్తుండగా కత్తిపూడి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రాంగ్ రూట్లో వచ్చిన ఓ లారీ ఆమె స్కూటీని బలంగా ఢీకొట్టింది. దీంతో అఖిల తీవ్రంగా గాయపడ్డారు.వైద్యులు బ్రెయిన్డెడ్ అని తేల్చారు.
సహచర ఉపాధ్యాయుల తో కలిసి ‘సంకల్పం’ పేరిట స్వచ్ఛంద అఖిల సేవలు చేసేవారు . మరణాంతరం అవయవదానానికి ముందుగానే ఆమె అంగీకారం తెలపారు. దీంతో వైద్యులు ఆమె బాడీ నుంచి అవయవాలు సేకరించేందుకు సన్నద్ధమయ్యారు. ఆమెను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో చేయి కొద్దిగా కదపడంతో అఖిల బతుకుతుందని కుటుంబ సభ్యులు ఆశపడ్డారు.
అఖలకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడిని తల్లి దగ్గరికి తీసుకెళ్లారు. అమ్మా అంటూ పిలిపించారు. ఆ మాటలకు మరోసారి చేయి కదపడంతో వెంటనే అవయవ దానాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత అఖిల కొంత కోలుకున్నారు. ఇంతలోనే ఆమె పరిస్థితి మళ్లీ విషమించింది. బుధవారం సాయంత్రం అఖిల అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఆమె మరణంతో కుటుంబసభ్యులు, బంధువుల కన్నీరుమున్నీరయ్యారు. అమ్మ మళ్లీ తనను ఎత్తుకుంటుందని, గోరుముద్దులు తినిపిస్తుందని ఆశపడ్డ ఈ చిన్నారికి ఇక అమ్మరాదు అని తెలియక అమాయకంగా దిక్కులు చూస్తున్నాడు. పాపం పసివాడు తల్లిలేని బిడ్డయ్యాడు.