CM Jagan : ఏపీలో సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఎన్నో అందమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలున్నాయి. అదే సమయంలో సందర్శకులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. పర్యాటకులకు రక్షణ భరోసా ఇస్తే టూరిజం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
పర్యాటక ప్రదేశాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీసు స్టేషన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి.
పోలీస్శాఖలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పోలీసులు స్నేహితులే అనే భావనను తీసుకురాగలిగామని చెప్పారు. పోలీస్ స్టేషన్లలో రిసెష్పనిస్టులు పెట్టి తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామన్నారు. పర్యాటకుల భద్రత కోసమే టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. యాత్రికులు నిర్భయంగా పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఉపయోగపడతాయని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
పర్యాటక ప్రదేశాల్లో నేరాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైంగిక దాడులు, దోపిడీలు లాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. ఇప్పుడు పర్యాటక పోలీసు స్టేషన్లు ఏర్పాటుతో పోలీసుల నిఘా పెరుగుతుంది. ఎలాంటి ఆపదలో ఉన్నా సందర్శకులు సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇస్తే .. వారిని పోలీసులు రక్షించే అవకాశం ఉంటుంది. ఏపీ ప్రభుత్వం చర్యలతో రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.