Tirumala Laddu Controversy: నిన్నటి వరకు తిరుమల లడ్డు వివాదంపై విమర్శలు పార్టీల వరకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం తిరుమల లడ్డూలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం.. తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు సైతం తాకింది. లడ్డు వివాదం సమయం నుండి కూటమి వర్సెస్ వైసీపీ మధ్య వార్ కొనసాగుతుందని చెప్పవచ్చు. నెయ్యి కల్తీ వ్యవహారం మొత్తం వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిందని, కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. అయితే ఆ మహా పాపం తనది కాదు అంటూ వైసీపీ సైతం ఎదురుదాడికి దిగి ఇటీవల ఆలయాలలో వైసిపి నాయకులు పూజలు సైతం నిర్వహించారు. ఈ క్రమంలో తాను తిరుమలకు వెళుతున్నట్లు ప్రకటించిన మాజీ సీఎం వైఎస్ జగన్.. డిక్లరేషన్ అంశం తెరమీదికి రాగానే.. ఒక్కసారిగా తన పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా తిరుమల లడ్డు వివాదం రోజుకొక మలుపు తిరుగుతుండగానే.. ఓవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. అయితే తాజాగా లడ్డు వివాదానికి సంబంధించిన అంశంపై టాలీవుడ్ అగ్ర హీరో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. టెర్రరిస్ట్ లు కూడా ఈ దారుణానికి పాల్పడరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
హీరో, విలన్ , పాత్రల ద్వారా అభిమానులను అలరిస్తున్న సుమన్ ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన ఓ కార్యక్రమంలో హీరో సుమన్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా అక్కడికి వెళ్ళిన మీడియా ప్రతినిధులు లడ్డు వివాదంపై సుమన్ ను ప్రశ్నించగా.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా లడ్డు కల్తీ చేయడం దారుణమైన విషయమన్నారు. కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి ప్రసాదాన్ని కల్తీ చేసేంత సాహసం చేసిన వారు.. టెర్రరిస్టుల కంటే దుర్మార్గులుగా ఆయన అభివర్ణించారు. తిరుమల ప్రసాదం అంటేనే ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఈ వివాదంతో తిరుమల లడ్డు పవిత్రతపై నీలి మేఘాలు కమ్ముకున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లడ్డు తయారీలో పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. కోట్ల మంది హిందువులు నిరంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తుంటారని, అటువంటి భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించిన ఎవరిని వదిలి పెట్టొద్దన్నారు. ప్రసాదంలో కల్తీ కి పాల్పడిన ఎవరినైనా వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. టీటీడీలో సభ్యులుగా భక్తి భావం కలిగి ఉన్న వారిని తీసుకోవాలని సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో అందరు భక్తుల మాదిరిగానే, తాను సైతం భాగస్వామ్యం అవుతానన్నారు.
ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ డిక్లరేషన్ వివాదంపై సైతం సుమన్ స్పందించారు. తిరుమల దర్శనానికి వెళ్లే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఉందని.. ఈ విషయంపై వ్యక్తిగతంగా జగన్ ఆలోచించుకోవాలని సూచించారు. ఏదిఏమైనా తిరుమల పవిత్రతను దెబ్బతీసే ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా.. ప్రభుత్వం పూర్తి దృష్టి కేంద్రీకరించాలని సుమన్ కోరారు. అయితే లడ్డు వివాదంపై తొలిసారిగా స్పందించిన నటుడు సుమన్ కాగా.. టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాదంపై స్పందించే ఆవకాశం ఉంది.