Tirupati Rains: తిరుపతి జిల్లాలో కాళంగి, మల్లెమడుగు, స్వర్ణముఖి నదులకు భారీగా వరదనీరు చేరింది. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కోట, శ్రీకాళహస్తి, ఏర్పేడు, వాకాడు తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తిరుమల ఘాట్రోడ్డులోనూ కొన్నిచోట్ల చెట్లు కూలగా.. వెంటనే తొలగించారు. శ్రీకాళహస్తిలోని ప్రాజెక్టు వీధిలో వందేళ్లనాటి చెట్టు కూలింది. వాన, గాలులతో తిరుపతి జిల్లాలో పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచింది.
మిగ్ జాం తుపానుతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతో తిరుపతి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే వందల గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టోల్ ప్లాజా సమీపంలోని గోకులకృష్ణ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద కాళంగి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై నాలుగు అడుగుల మేర నీటిమట్టంతో వరద ప్రవహిస్తుండటంతో పోలీసులు రహదారిని మూసివేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని వట్రపాలెం పూర్తిగా మునగడంతో సుమారు 500 మందిని, వాకాడు పరిధిలో 250 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మంగళ, బుధవారాలు మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్ తో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పూలవానిగుంట, గొల్లవాని గుంట ప్రాంతాల్లో టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగర కమిషనర్ హరిత పర్యటించారు. నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
మిగ్ జాం తుపాను ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తిరుమలలో కేవలం 24 గంటల్లోనే 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోగర్భమయ, పాప వినాశనం డ్యామ్ నుంచి అధికారులు అర్ధరాత్రి నీటిని విడుదల చేశారు.
.
.