Tirupati Laddu Row: నెయ్యి సరఫరాదారులను హెచ్చరించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ వివాదంపై స్పందించారు. ‘బయట ల్యాబుల్లో నెయ్యిని టెస్ట్ చేయించాం. రూ. 320కు కిలో నెయ్యి రాదని అందరూ చెబుతున్నందునే టెస్ట్ కు ఇచ్చాం. నెయ్యి నాణ్యతపై 39 రకాల టెస్టులు చేయించాం. నెయ్యి నాణ్యత బాగాలేదని చాలామంది భక్తులు ఫిర్యాదు చేశారు. నెయ్యి నూనెలా ఉందని ఫిర్యాదు చేశారు. జంతువుల కొవ్వు వాడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. నెయ్యి నాసిరకంగా ఉందని కాంట్రాక్టర్లకు చెప్పాం. అదే సరఫరాదారులకు అవకాశంగా మారింది. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకుల్లో క్వాలిటీ లేదని తెలిసింది. టీటీడీకి ప్రస్తుతం 4 సంస్థలు నెయ్యి సరఫరా చేస్తున్నాయి.
Also Read: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?
జులై 6, 12 తేదీల్లో ట్యాంకుల్లో వచ్చిన నెయ్యిని ల్యాబ్ కు పంపించాం. ఏఆర్ డెయిరీ మినహా మిగతా సంస్థలు సరఫరా చేసిన నెయ్యి బాగానే ఉంది. లాడ్ అనే టెస్టులో 102 దిగువ… 95కు పైగా ఉండాలి. టీటీడీకి సొంత టెస్టింగ్ ల్యాబ్ లేదు. రూ. 75 లక్షల ఖర్చయ్యే ల్యాబ్ ను ఎందుకు పెట్టలేదో తెలియదు. లడ్డూ తయారీకి నాణ్యమైన ఆవు నెయ్యి వాడాలి. తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే క్వాలిటీ లేదని అర్థమవుతోంది’ అంటూ ఆయన పేర్కొన్నారు.
‘లడ్డూ నాణ్యతపై చాలా రోజుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయమై సిబ్బందితో కూడా మాట్లాడాను. వారు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ నెయ్యి బాగాలేదని చెప్పారు. నెయ్యి నాణ్యంగా లేకపోతే లడ్డూ నాణ్యతగా ఉండబోదని చెప్పారు. ఈ విషయాన్నే నేను కూడా స్వయంగా గుర్తించాను. పైగా వాళ్లు తక్కువ ధరకే నెయ్యిని సరఫరా చేస్తున్నారు. ఇంత తక్కువ ధరకే వాళ్లు కిలో నెయ్యిని సరఫరా చేస్తున్నారు. నాణ్యమైన నెయ్యి అంత తక్కువ ధరకు ఎవరూ సరఫరా చేయరు. ఆ వెంటనే స్పందించి గుత్తేదారును హెచ్చరించా. నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయాలని చెప్పాను.
Also Read: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు
అయితే, నెయ్యి నాణ్యతను నిర్ధారించేందుకు టీటీడీకి సొంతంగా ప్రయోగశాల లేదు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో ఎటువంటి పరీక్షలు చేయలేదు. నాణ్యత నిర్ధారణ కోసం బయట ల్యాబ్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది’ అని శ్యామలరావు అన్నారు.