తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వాడకంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. కాసులకు కక్కుర్తిపడి వైసీపీ ప్రభుత్వం.. ఈ అపచారానికి పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ఏకిపారేస్తున్నారు. మరోవైపు.. వైసీపీ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం.. వైసీపీ నిర్వాకాన్ని ఎండగట్టారు. జాతీయ స్థాయిలో రాజకీయ నేతలు, న్యాయవ్యవస్థ, ప్రజలు, మీడియా, మతాధిపతులంతా కలిసి ఒక చర్చ వేదికను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి అపవిత్రమైన చర్యలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. అయితే, పవన్ అంతటితో ఆగలేదు.. ఆదివారం నుంచి 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు.
పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం.. గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని పవన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. లడ్డుకు ఉపయోగించే నెయ్యి.. జంతు అవశేషాలతో మాలిన్యమైందని, ఈ పాపాన్ని ముందుగానే పసిగట్టకపోవడం హైందవ జాతికే కళంకం అని పేర్కొన్నారు. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు కలిశాయని తెలిసిన తన మనసు వికలమైందని, అపరాధ భావానికి గురైందని తెలిపారు. ఈ విషయం తనకు ముందుగానే తెలియకపోవడం తనని బాధించిందని అన్నారు.
సనాతన ధర్మాన్ని నమ్మే.. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారాన్ని సనానత ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చితంగా చేసుకోవాలని పవన్ అన్నారు. ఈ సందర్భంగా తాను ప్రాయశ్చిత దీక్ష చేయాలని సంకల్పించానని పవన్ వెల్లడిచారు. ఈ ఆదివారం (సెప్టెంబర్ 22న) ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. 11 రోజల దీక్ష తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానన్నారు. గల పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వాలని వేడుకుంటాన్నారు.
Also Read: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల
భగవంతుడిపై విశ్వాసం లేనివారు.. పాప భీతి లేనివారే ఇలాంటి అకృత్యాలకు పాల్పడతారని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోయారని, కనిపెట్టినా నోరు మెదపకపోవడం తనని బాగా బాధించిందని అన్నారు. అప్పటి రాక్షస పాలకులకు భయపడి నిశబ్దంగా ఉండిపోయారని తనకు అనిపిస్తోందన్నారు. వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా గత పాలకులు పెడపోకడలకు పాల్పడ్డారన్నారు. వారి తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించిందని తెలిపారు. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందని పేర్కొన్నారు.
తిరుపతి లడ్డులో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్త బయటకు వచ్చిన రోజు నుంచి భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అందుకే పవన్ ప్రాయశ్చిత దీక్షకు పూనుకున్నారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు జనసైనికులు, ఆయన అభిమానులు దీక్షలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇదే..
ఏడుకొండలవాడా..! క్షమించు
•11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం…— Pawan Kalyan (@PawanKalyan) September 21, 2024