Tirumala Tirupati Devasthanam Srivari Seva Services: తిరుమలకు వెళ్లే భక్తులకు ముఖ్యమైన సమాచారం తిరుమల తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు. ఈనెల 15 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగుతున్నందున పలు సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది.
ఆగస్టు 14 వ తేదీన అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవ, 15 వ తేదీన తిరుప్పావడ, 15 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు దాదాపు మూడు రోజుల పాటు స్నపన తిరుమంజనం సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమల్లయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శమిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 15న పవిత్రాల ప్రతిష్ట, 16న పవిత్ర సమర్పణ, 17న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నామని వివరించారు.
శ్రీవారి ఆలయంలో ఏడాది మొత్తం జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటితో ఆయన పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్ర్తం ప్రకారం..పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Also Read: కష్టాల్లో ఉన్నా.. పవన్ కళ్యాణ్ అండగా నిలవాలి: దివ్వెల మాధురి
ఇదిలా ఉండగా, తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇప్పటికే 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అయితే నిన్న శ్రీవారిని 86,604 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 31,536 మంది తలనీలాలు సమర్పించారు.