Tirumala: అసలే దసరా సెలవులు వచ్చేస్తున్నాయి. ప్రతి ఇంటా సందడి నెలకొంటుంది. ఈ సమయంలో పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు. అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారిని దర్శించి, స్వామి వారి కటాక్షం పొందాలని భావిస్తారు. ముందుగా శ్రీవారి దర్శనం కోసం ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోలేదని భావించే వారి కోసం టీటీడీ స్వామి వారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ వివరాలే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ప్రతిరోజూ భక్తుల రద్దీ తిరుమల క్షేత్రంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే తిరుమల శ్రీవారిని దర్శించేందుకు కావలసిన టిక్కెట్లను.. తిరుమల పర్యటన ప్లాన్ చేసుకున్న ప్రతి ఒక్కరూ రెండు, మూడు నెలల ముందే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటారు. ప్రస్తుతం దసరా సెలవులు కాబట్టి.. ఎవరైనా తిరుమలకు వెళ్లాలని భావిస్తే దర్శనం టికెట్ల సమస్యను ఎదుర్కొంటారు. ఇటువంటి వారు దర్శనం టికెట్లు బుక్ చేసుకోకుండానే స్వామివారిని దర్శించేలా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
శ్రీవారి దర్శనం ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోలేని వారు, తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ వద్దకు వెళితే చాలు మీ సమస్య తీరినట్లే. ఇక్కడ మనం స్లాటెడ్ సర్వ దర్శనం టికెట్లు పొందే అవకాశాన్ని టిటిడి కల్పించింది. ఈ టికెట్ల కోసం మీ వద్ద ఆధార్ కార్డు ఉంటే చాలు..శ్రీవారి దర్శనం టికెట్ మీ చేతిలో ఉన్నట్లే. అయితే మరికొందరు తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకోవాలని మొక్కుకుంటారు. అటువంటి వారు ఆన్లైన్ ద్వారా టికెట్లను పొందని సమయంలో.. భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద దివ్యదర్శనం టికెట్లు పొందవచ్చు. అంతేకాదు ఈ టికెట్లు కూడా దొరకని పక్షంలో ఉచిత క్యూ లైన్ లో స్వామివారిని మనం దర్శించే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. అయితే ఈ దర్శనానికి 6 నుండి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇలా క్యూ లైన్ లో ఉండి స్వామివారి దర్శనం చేసుకోవడం పిల్లపాపలతో ఉన్న వారికి కొంత కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ భాగం తెల్లవారుజామున స్లాటెడ్ సర్వ దర్శనం తీసుకుంటే శ్రీవారి దర్శనం సులభతరమవుతుంది.
Also Read: Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక,
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 29న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్టోబరు 4న శ్రీ కామాక్షి దేవి, అక్టోబరు 5న శ్రీ ఆదిపరాశక్తి, అక్టోబరు 6న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, అక్టోబరు 7న మావడి సేవ, అక్టోబరు 8న శ్రీఅన్నపూర్ణాదేవి, అక్టోబరు 9న శ్రీ దుర్గాదేవి, అక్టోబరు 10న శ్రీ మహిషాసురమర్థిని, అక్టోబరు 11న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 12న శ్రీ శివపార్వతుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 12న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటన జారీ చేసింది.