SIT inquiry: తిరుమల లడ్డూ వివాదంలో సిట్ దర్యాప్తు ఎప్పుడు దిగుతోంది? ఈ వారంలో సిట్ రంగంలోకి దిగనుందా? కల్తీ విషయంలో పాత లడ్డూలు ఏమైనా ఉన్నాయా? విచారణపై మాజీ సీబీఐ అధికారులు ఏం చెబుతున్నారు? సిట్ ఎవరినైనా విచారించవచ్చా? ట్యాంకర్ డ్రైవర్ నుంచి టీటీడీ అధికారుల వరకు ఎవరినైనా విచారించవచ్చా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తిరుమల లడ్డూ కల్తీ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత నేషనల్ మీడియా, ప్రాంతీయ మీడియా ఛానెళ్లు సైతం ఈ అంశంపై డిబేట్ మొదలుపెట్టాయి. చాలా ఛానెళ్లు మాజీ సీబీఐ అధికారుల వెర్షన్ను తీసుకున్నాయి. హైప్రొఫైల్ కేసు కావడంతో న్యాయస్థానం ప్రత్యేకంగా సిట్ వేసిందని అంటున్నారు. ఈ తరహా కేసులు చాలా తక్కువ ఉంటాయని గుర్తు చేస్తున్నారు.
ఈ ఏడాది కోల్కత్తా హైకోర్టు ఇదే విధంగా సిట్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈడీ అధికారులపై కోల్కతాలో దాడులు చేశారు కొంతమంది. దీనిపై న్యాయస్థానం సీబీఐతోపాటు బెంగాల్కు చెందిన పోలీసు అధికారులతో కలిసి సిట్ వేసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. తిరుమల లడ్డూ కేసు దర్యాప్తు వేగంగా జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
సిట్ దర్యాప్తు చేసిన అంశాల ఆధారంగా స్థానిక తిరుపతి కోర్టులో ఛార్జ్షీటు దాఖలు చేస్తారు. ఇందులో ఏమైనా మనీ లావాదేవీలు జరిగినట్టు ఒకవేళ తేలితే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటే అప్పుడు సిట్ తన ఛార్జిషీటును.. సీబీఐ కోర్టులో వేస్తుందని గుర్తు చేస్తున్నారు మాజీ అధికారులు. టీటీడీ అధికారి ఫిర్యాదుతో తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో చీటింగ్, క్రిమినల్, అడల్టరేషన్ కింద కేసు నమోదైంది.
ALSO READ: పవన్ కల్యాణ్కు బిగ్షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..
దీని ఆధారంగా దర్యాప్తులో నిమగ్నం కానుంది సిట్. టెండర్ డాక్యుమెంట్లలో ఏమైనా మార్పులు జరిగాయా? ఆ కంపెనీని టెండర్ దక్కేలా మార్పులు చేర్పులు చేశారా? గతంలో టెండర్… ఇప్పుడున్న దానికి తేడా ఏంటి? రేట్ల ధరలను సైతం పరిశీలించనుంది. టీటీడీ ల్యాబ్ ఏవిధంగా ఉంది? ఈ క్రమంలో అనేక మందిని ప్రశ్నించనుంది సిట్.
ఆనాటి టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిని సైతం విచారించే అవకాశముందని చెబుతున్నారు. అంతేకాదు నెయ్యి తీసుకొచ్చిన లారీ డ్రైవర్ను సైతం సిట్ విచారించనుంది. మార్గ మధ్యలో నెయ్యి ఏమైనా కల్తీ జరిగిందా? అనేది కూడా పరిశీలించనుంది.
విచారణ మరింత ఆలస్యమయి ఎవరైనా పిటిషన్ వేస్తే, అప్పుడు దర్యాప్తుకు టైమ్ బాండ్ విధించే అవకాశముందన్నది సీబీఐ మాజీ అధికారులు మాట. ఈ కేసు విచారణంతా డాక్యుమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. వాటిని ప్రూవ్ చేయడానికి కొంతమంది వ్యక్తులను విచారించనుంది.
ఏఆర్ డెయిరీ నుంచి తిరుమలకు దూరమెంత? టోల్ గేట్ వద్ద ఎంత సమయం తీసుకున్నారు? మార్గమధ్యలో ఏమైనా కల్తీ చేసే ఛాన్స్ ఉందా అనే దానిపైనా ఆరా తీయనుంది సిట్. పిటిషన్ సమయంలో న్యాయస్థానం లేవనెత్తిన అంశాలపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తుందని చెప్పుకొచ్చారు మాజీ సీబీఐ అధికారులు.