Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో వాదోపవాదనలు వాడి వేడీగా సాగాయి. తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ కొనసాగించాలా? లేదా? సహకారం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ని కోరింది సుప్రీంకోర్టు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని, స్వతంత్ర విచారణ జరపాలా? లేదా చెప్పాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై తదుపరి వాదనలు అక్టోబరు మూడున జరగనున్నాయి.
తిరుమల లడ్డూ వివాదంలో ఏపీ సీఎం చేసిన ప్రకటన వాస్తవానికి భిన్నంగా ఉందన్నారు సుబ్రహ్మణ్య స్వామి తరపు న్యాయవాది. కల్తీ జరిగినట్టు గుర్తించిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందన్నారు. ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించమని టీటీడీ చెబుతోంది. శాంపిళ్లను ఎక్కడ నుంచి సేకరించారు? తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపిళ్లను సేకరించారా? ఇందులో రాజకీయ జోక్యాన్ని అనుమతించ వచ్చా? కల్తీ నెయ్యి 100% వాడలేదని టీటీడీ అధికారి చెబుతున్నారు. బహిరంగ ప్రకటన ఏ ప్రాతిపదికన చేశారనే దానిపై తాను ఆందోళన చెందుతున్నానని తెలిపారు.
నెయ్యి రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలని వ్యాఖ్యానించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఎక్కడని ప్రశ్నించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం ల్యాబ్కు శాంపిల్ పంపారా? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది.
కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో తెలీకుండా సీఎం ఎలా ప్రకటన చేశారని ప్రశ్నించింది. సిట్ని నియమించిన తర్వాత మీడియా ముందు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారన్నది న్యాయస్థానం ప్రశ్న. ప్రస్తుతం పరిస్థితుల్లో సిట్ సరిగ్గా విచారణ జరుపుతుందా లేదా అనేదానిపై అనుమానాలున్నాయని తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బాగుంటుందని అభిప్రాయపడింది. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయస్థానం అక్టోబరు మూడుకి వాయిదా వేసింది.
ALSO READ: వరదలకు దూరం.. ‘లడ్డూ’ కోసమే వచ్చారు
తిరుమల లడ్డూ వివాదంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథులతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మసనం ముందు నాలుగు పిటిషన్లు విచారణకు వచ్చాయి. వారిలో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, హిందీ ఛానల్ ఎడిటర్ సురేష్ చౌహాన్కె, డాక్టర్ విక్రమ్ సంపత్ కి చెందిన పిటీషన్లను విచారించింది.
ఈ కేసులో వివిధ పార్టీల తరఫున హాజరయ్యారు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. కపిల్ సిబాల్, ముహుల్ రోహత్గి, సిద్ధార్థ లూథ్రా, సుబ్రమణియన్ స్వామి తరఫున న్యాయవాది రాజశేఖర్రావు ఉన్నారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అటెండయ్యారు.