తిరుపతి లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిసిన నెయ్యి వాడారనే అంశంలో పది రోజులగా జరుగుతున్న చర్చ.. వాస్తవాలను ముందుకు తీసుకురావటానికి, అక్కడి వ్యవస్థను ప్రక్షాళన చేయటానికంటే రాజకీయ పార్టీలు ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకోవటానికి ఎక్కువగా ఉపయోగపడుతోంది.
దేశంలోనే అత్యధిక మంది సందర్శించే తిరుమల క్షేత్రంలో ఇచ్చే లడ్డూ ప్రసాదం అనేకమంది భక్తుల మనోభావాలు, నమ్మకాలతో ముడిపడినది. అందులో వాడాల్సిన అన్ని రకాల దినుసులూ నాణ్యంగా ఉండాలి. నిజమే. అయితే, ఇది తిరుమలకే పరిమితం కాకుండా, దేశంలో ప్రభుత్వ హయాంలో నడిచే ప్రతి ఆలయంలోనూ ఇదే విధానం అమలు కావాలని ఏ పార్టీ కూడా కోరటం లేదు.
భక్తుల మనోభావాలకు గాయాలు…
ఈ సమయంలోనూ పలు ఆలయాల నిర్వహణలోని లోపాలపై ఎవరూ నోరెత్తటం లేదు. రాజకీయంగా పైచేయి సాధించే క్రమంలో నేతలు భక్తుల మనోభావాలను గాయపరిచేలా, మత వైషమ్యాలను రెచ్చగొట్టే పరిభాషను ఎంచుకోవటం దురదృష్టకరం.
నేటి లడ్డూ వివాదంతోనే తిరుమల ప్రతిష్ట మంటగలిసిందనే వారు గత పదేళ్లలో జరిగిన అనేక సంఘటనలను గుర్తుంచుకోవాలి. తిరుమల ప్రధాన పూజారి రమణ దీక్షితులు గతంలో చేసిన వ్యాఖ్యలు, క్రైస్తవ సువార్త కూటముల్లో విశ్వాసిగా పాల్గొన్న సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్గా పనికిరాడని హిందూ సంస్థలు చేసిన ఆందోళన, టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియామకమైన తెదేపా ఎమ్మెల్యే అనిత- ‘నేను క్రైస్తవురాలిని’ అని చెప్పుకొన్న వీడియోలు బయటపడేసరికి ఆమెను వెనక్కి పిలిచింది గత సర్కారు.
స్వామివారి ప్రతిష్టకు అగౌరవం..
ఇక నోట్ల రద్దు సమయంలో గుట్టలకొద్దీ కరెన్సీ కట్టలతో దొరికిపోయిన టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి అవినీతి, గతంలో నాస్తికుడైన భూమన కరుణాకర్రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం, తిరుమలలో ప్రైవేటు వ్యక్తులకు గెస్ట్హౌస్లు కట్టుకునేందుకు అనుమతులు, తిరుమలపై యధేచ్ఛగా జరుగుతున్న అన్యమత ప్రచారం, దేవస్థానంలో అన్యమతస్తులు నేటికీ పనిచేయటం, తిరుమల నిధులను మళ్లించడం, తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటు, సామాన్య భక్తులను పక్కనబెట్టి వీవీఐపీలకు ప్రాధాన్యం ఇవ్వటం.. ఇవన్నీ తిరుమల ప్రతిష్టను మంటగలిపేవే. పై ఉదంతాల్లో అన్ని పార్టీల, అన్ని వర్గాల హిందువుల పాత్రా ఉంది. మరి వీటి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదో మరి.
also read : టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్
నిజానికి తిరుమలలో పరిశుభ్రత తప్ప, మిగతా విషయాల్లో సామాన్య భక్తులకు చాలా కష్టాలున్నాయి. తరతరాలుగా తిష్టవేసుకొని కూర్చొన్న చాలామంది అధికారులకు, రాజకీయ ప్రాబల్యంతో వస్తున్న బోర్డు సభ్యుల్లో చాలామందికి హిందూ ధార్మిక అంశాలపై అవగాహన లేదు.
వారికి అధికార దర్పం తప్ప హైందవ ధర్మ అభివృద్ధికి సంబంధించిన మనసు లేదు. తిరుమల అభివృద్ధిలో ఎందరో ఐఎఎస్ అధికారుల పాత్ర వుంది. కానీ క్రింది స్థాయిలో పేరుకుపోయిన జాడ్యం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నది.
ఇక్కడి సంప్రదాయం, ధర్మం, సాహిత్యం తెలిసిన ఎందరో నిజాయితీపరులైన అధికారులుండగా, శ్రద్ధ, భక్తి, దైవభీతి లేని అధికారుల రాజ్యమే టీటీడీలో సాగుతోంది. భక్తి లేకుండా కేవలం పదవుల కోసం, అధికార దర్పం కోసం, రాజకీయ నిరుద్యోగులకు నీడ కల్పించేందుకు టీటీడీని, అనేక దేవాలయాలను ఉపయోగించుకోవడంలో అన్ని పార్టీలకూ భాగస్వామ్యం ఉన్నది. కనుక వాటన్నింటి మీదా కూడా పార్టీలు చర్చకు సిద్ధపడి, అక్కడి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించగలిగితే మన దేవాలయ వ్యవస్థ కొంతైనా బాగుపడుతుంది.
– ఇందు బలరాం, జర్నలిస్ట్