Tirumala Hundi Income: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. జనవరి1న ఆలయంలో పెద్దశాత్తుమొర, వైకుంఠ ద్వారదర్శనం ముగింపు, 5న అధ్యయనోత్సవాలు ముగింపు, 6న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు కార్యక్రమాలు, 7న సర్వ ఏకాదశి, 9న తొండర డిప్పొడియాళ్వార్ వర్ష తిరునక్షత్రం ఉంటాయని అధికారులు తెలిపారు. 14న భోగిపండుగ, ధనుర్మాసం ముగింపు, 15న మకర సంక్రాంతి, సుప్రభాత సేవ పునఃప్రారంభం, 16న పార్వేట మండపానికి వేంచేపు, కనుమ పండుగను వైభవంగా జరుపనున్నట్టు పేర్కొన్నారు. జనవరి 25న శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి, 28న తిరుమొళిశైయాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 31న కూరత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక శ్రీవారికి వచ్చే ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. రోజుకు సగటున శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్లు దాటుతోంది. ఈ క్రమంలోనే 2023 ఏడాదిలో తిరుమల వేంకటేశ్వరుడికి వచ్చిన మొత్తం హుండీ ఆదాయం వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. గడిచిన ఏడాదిలో మొత్తం శ్రీవారి హుండీ ఆదాయం 1398 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారికి భారీగా నగదు, ఇతర విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతీ నెల 100 కోట్లకు పైగానే సమకూరుతూ వస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే 2023 జులై నెలలో అత్యధికంగా 129 కోట్ల హుండీ ఆదాయం లభించిందని తాజాగా టీటీడీ పేర్కొంది. ఇక నవంబర్ నెలలో అత్యల్పంగా 108 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఇక డిసెంబర్ నెలలో కూడా హుండీ ఆదాయం 100 కోట్లకు పైగా దాటినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో వరుసగా 22వ నెల కూడా శ్రీవారి హుండీలో 100 కోట్లకు పైగా నగదు వచ్చి చేరినట్లు పేర్కొన్నారు. ఇక 2023 డిసెంబర్ నెలలో శ్రీవారికి హుండీ ద్వారా 116 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. 2022లో శ్రీవారి హుండీ ఆదాయం 1450.41 కోట్లు రాగా.. 2023లో 1398 కోట్లు వచ్చింది. అంటే సుమారుగా 52 కోట్ల ఆదాయం తగ్గింది.