Tirumala Declaration Row| తిరుపతి తిరుమల దేవస్థానం(టిటిడి)లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. కల్తీ నెయ్యి వివాదంలో సిఎం చంద్రబాబు తిరుమల ఆలయాన్ని ప్రతిష్టను కించపరిచే ప్రయత్నం చేశారని దానికి ప్రాయశ్చిత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తున్నామని వైసీపీ నాయకులు తెలిపారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలలో పూజల కోసం రానుండడంతో డిక్లరేషన్ పేరుతో కొత్త వివాదం మొదలైంది. మాజీ సిఎం జగన్ కూడా డిక్లరేషన్ ఫారం సమర్పించాలని రచ్చ జరుగుతోంది.
డిక్లరేషన్ అంటే ఏంటి?
టీటీడీ నిబంధనల ప్రకారం.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే హిందూయేతర మతాలకు చెందిన వారు డిక్లరేషన్ సమర్పించాలి. 1990లో అప్పటి ప్రభుత్వం.. దేవాదాయశాఖ చట్టం 30/1987 కింద ఒక జీవో తీసుకువచ్చింది. ఈ జీవో నిబంధన ప్రకారం.. హిందువులు కాకుండా ఇతర మతాలకు చెందిన వ్యక్తులు శ్రీవారి ఆలయంలో ప్రవేశానికి ముందు డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఫారంలో ఆ అన్య మతానికి చెందిన వ్యక్తి.. తాను శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకంతో ఆయన దర్శనానికి వచ్చానని.. దర్శనం కోసం అనుమతించాలని కోరుతూ తన వివరాలు తెలిపి సంతకం చేయాల్సి ఉంటుంది.
గతంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం లాంటి చాలామంది ప్రముఖలు తిరుమల దర్శనానికి వచ్చిన సమయంలో డిక్లరేషన్ సమర్పించారు. తిరుమల దేవాలయానికి వచ్చే ఇతర మతాల భక్తులు 17వ కంపార్ట్మెంటు వద్ద డిక్లరేషన్పై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రముఖులు, విఐపీ భక్తులు దర్శనానికి వచ్చిన సమయంలో టిటిడి అధికారులే స్వయంగా గెస్ట్హౌస్ కు వెళ్లి విఐపీల చేత డిక్లరేషన్ ఫారంపై సంతకాలు తీసుకుంటారు.
నటుడు షారుఖ్ ఖాన్ సంతకం చేసిన తిరుమల డిక్లరేషన్ ఫారం ఇదే..
తిరుమలో ఇప్పుడు మాజీ సిఎం జగన్ దర్శనానికి వెళ్లాలంటే ఆయన మతస్తుడు కాబట్టి నిబంధనల ప్రకారం.. డిక్లరేషన్ సంతకం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి పార్టీలు (టిడిపి, జనసేన, వైసిపీ) డిమాండ్ చేస్తున్నాయి. ఆయన శ్రీవారి ఆలయంలో ప్రవేశించాలంటే డిక్లరేషన్ సమర్పించాలని రాజకీయ పార్టీలతో పాటు హిందూ సంఘాలు, స్వామీజీలు కూడా పట్టుబడుతున్నారు. ఒకవేళ డిక్లరేషన్ సమర్పించకపోతే జగన్ ను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు వైసీపీ నాయకులు అధికార పార్టీల తీరుని విమర్శిస్తున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తిరుమల దర్శనానికి జగన్ వెళుతుంటే.. ప్రభుత్వం రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులను ప్రభుత్వం క్రియేట్ చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. టిడిపి, జనసేన, బిజేపీ నాయకులు జగన్ డిక్లరేషన్ సమర్పించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం అని అన్నారు. టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ.. ఎన్ని అడ్డంకులు వచ్చినా తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకునే వెళ్తారని అన్నారు.
డిక్లరేషన్ రూల్ను గతంలో సీరియస్గా అమలు చేయని టీటీడీ బోర్డు
డిక్లరేషన్ నియమాలను టిటీడి గతంలో విఐపీలు, ప్రముఖులు వచ్చని సమయంలోనే పాటించేదని తెలుస్తోంది. సాధారణ భక్తులు దర్శనానికి వస్తే వారిలో ఇతర మతాలకు చెందిన వారు ఉన్నా.. వారి డిక్లరేషన్ తీసుకునేవారు కాదని సమాచారం. పైగా వైసీపీ హయాంలో ఈ డిక్లరేషన్ నిబంధనలను నిర్లక్ష్యం చేశారని తెలుస్తోంది. ఇప్పుడు స్వయంగా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి డిక్లరేషన్ సమర్పించాలని రాజకీయ పార్టీలు పట్టుబడుతుండడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారింది.