Tiger Hulchul : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వాసులను పెద్దపులి హడలెత్తిస్తోంది. ఒక్కోచోట ఒక్కోరకంగా పులి పాదముద్రలు.. సంచరించేది పెద్దపులి ఒక్కటేనా.. రెండా అనే అనుమానం కలుగుతోంది. వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. దెందులూరు మండలం మేదినరావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించి.. అటవీ శాఖకు సమాచారం అందించారు. పాదముద్ర ఆధారంగా పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.
13 సెంటీమీటర్ల పైగా పాదముద్రలు ఉంటే పులి సంచారం ఉన్నట్టు నిర్ధారిస్తారు. నాలుగు రోజుల క్రితం నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఆవు-దూడలపై పులి దాడి చేసింది. అనంతరం ద్వారకాతిరుమలలో మండలంలో ఆవులపై దాడి చేసి తినేసింది. ద్వారకాతిరుమల మండలం దేవినేని వారి గూడెంలో ఆవులపై పులి దాడి చేసింది. ఒక్కోచోట ఒక్కోరకంగా పాదముద్రలు ఉండడంతో… సంచరించేది ఒక్కటేనా లేక రెండా అనే అనుమానం కలుగుతోంది.
పోలవరం కుడికాలువ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి ఎక్కువగా సంచరిస్తున్నట్లు తెలిసింది. వారం రోజుల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో పులి సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పెద్దపులి జాడ తెలుసుకునేందుకు ఆరు బృందాలుగా ఏర్పడి అటవీ శాఖ సిబ్బంది గాలిస్తున్నారు. పులి సమాచారం కోసం అటవీ సిబ్బంది టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల పాక దగ్గర వెలుతురు ఎక్కువ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.