Kodali Nani Ticket Issue(AP political news): వైసీపీలో కృష్ణా జిల్లా రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది. ప్రతిపక్ష పార్టీ అగ్రనేతలు.. చంద్రబాబు, లోకేష్.. పవన్ కళ్యాణ్ లపై నిత్యం విమర్శలు కురిపించే వైసీపీ కీలక నేతలకు ఇప్పుడు సీట్ల కష్టాలు రావడం చర్చనీయాంశంగా మారుతోంది. మంచి మిత్రులుగా పేరున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లకు వైసీపీలో ఇంకా టికెట్లు ఖరారు కాలేదనే వార్త నేతల్లో గుబులు పుట్టిస్తోంది.
టీడీపీ నుండి వైసీపీ లోకి వచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వంశీకి.. ఈసారి అక్కడ సీటు లేదని అధిష్టానం సూచించినట్లు సమాచారం అందుతుంది. అలానే కొడాలి నానికి కూడా గుడివాడలో మొండి చేయి ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెనమలూరు వెళ్లాలని వంశీకి వైసీపీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లేదా విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని వంశీకి మరో ఛాయిస్ ఇచ్చారంటున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో వంశీ అయోమయంలో పడ్డారని టాక్ నడుస్తోంది.
Read More : ఎన్నికల వేళ.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..
అదే విధంగా ప్రతిపక్షాలపై తిట్ల పురాణంతో విరుచుకు పడే.. కొడాలి నానికి సీటుపై ఇంకా హామీ రాకపోవడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. వంశీకి స్థాన చలనం తప్పదని సంకేతాలు వస్తున్న తరుణంలో కొడాలి నాని.. చూపు గన్నవరంపై పడిందని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే వైసీపీలో పలు దఫాలుగా అభ్యర్ధుల జాబితాని ప్రకటించగా.. పలు చోట్ల ప్రతిపక్షాలపై నోరు పారేసుకొని నేతలకు సీటు ఇవ్వలేదు. అక్కడ తిడితే సీటు ఇవ్వలేదు.. ఇక్కడ తిట్టినా సీటు ఇవ్వలేదని కొత్త చర్చ తెరపైకి వస్తోంది. వైసీపీలో ఈ రెండు పాలసీల విధానం ఏమిటో అని ఈ ఇద్దరు మిత్రులు దారి ఎటో తెలియక సందిగ్ధంలో పడ్డారని అంటున్నారు. అయితే కొడాలి నాని మాత్రం సీటు తనకే అంటూ చెప్పడం గమనార్హం.
ఇలా జోగి రమేష్ ని ఇంకోసారి నియోజవర్గం మారాలని అధిష్ఠానం పిలుపునిస్తుందని తెలుస్తోంది. నూజివీడులో టీడీపీ నుండి బెర్త్ లేకపోవడంతో.. వైసీపీ గూటికి చేరారు ముద్రబోయిన వేంకటేశ్వరరావు. కాగా ముద్రబోయినను నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు.. సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. ఈ మేరకు వెంకటేశ్వరరావుకి సీఎం జగన్ రెండు ఆప్షన్స్ ఇచ్చారని.. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో.. మీ ఇష్టం అని సంకేతాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది. కానీ ముద్రబోయిన మాత్రం గన్నవరం వైపు చూస్తున్నారని సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ సీట్ల పంచాయతీతో కృష్ణా జిల్లా రాజకీయం ఆసక్తి రేపుతోంది.