Kakinada Road Accident: ఆదివారం ఉదయం కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. గండేపల్లి మండలం మురారి వద్ద ఓ బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ బైక్ ను గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వారి తల్లి తీవ్రగాయాల పాలవ్వగా.. ఆమెను రాజమండ్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాద ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన సంగలం దుర్గ (40)కు ముగ్గురు కొడుకులు రాజు (18), ఏసు (18), అఖిల్ (10) ఉన్నారు. కొడుకులతో కలిసి కూలిపనులు చేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. కూలిపనుల్లో భాగంగా నర్సీపట్నం వెళ్లిన నలుగురు.. బైక్ పై తిరిగి గ్రామానికి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మురారి శివారు ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. అందరూ కిందపడిపోయారు.
Also Read : వామ్మో కోచింగ్ సెంటర్ లోకి వదరనీరు..ముగ్గురు మృతి
పైకిలేచేలోపే వెనుకనుంచి వచ్చిన ఒక వాహనం బైక్ ను ఢీ కొట్టి వారి మీదినుంచి వెళ్లడంతో.. రాజు, ఏసు, అఖిల్ లు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. తల్లి దుర్గకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని ఢీ కొట్టిన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.