Pawan Kalyan : చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. దాదాపు 2 గంటలపాటు ఇరువురు నేతలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. భేటీలో చర్చించిన అంశాలను చంద్రబాబు, పవన్ వెల్లడించారు. తాను ఎక్కడికెళ్లినా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాజీవితం అంధకారం మారిపోయిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ తన లక్ష్యమన్నారు.
చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
అన్ని పార్టీలు, సంఘాలు కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ఎమర్జెన్సీ కంటే ఎక్కువగా ఏపీలో ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకెళతాం. పోలీసులు అర్ధరాత్రి వచ్చి ప్రతిపక్ష నేతల ఇళ్ల గోడలు దూకుతున్నారు. నా నియోజకవర్గంలో నన్ను అడ్డుకుంటారా? ఇప్పటంలో పవన్ ను అడ్డుకున్నారు. ఏపీలో వ్యవస్థలన్నీ నాసనం అయిపోయాయి. ఏపీలో ప్రజాస్వామ్యం లేదా?. కందుకూరు, గుంటూరు ఘటనలకు పోలీసులే కారణం. సినిమావాళ్ల కార్యక్రమాలు జరుపుకోవటానికి పరిష్మన్ ఇవ్వారా?. ఏపీలో పరిస్థితులపై కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి.
పొత్తులపై క్లారిటీ ఇదే..
పొత్తుల విషయంపై చంద్రబాబు స్పందించారు. రాజకీయాల్లో పొత్తులు సహజమన్నారు. పొత్తులపై మాట్లాడుకోవడానికి ఇంకా సమయం ఉందన్నారు. ఎన్నికలు, పొత్తులపై తర్వాత చర్చిస్తామని తెలిపారు. 2009లో అప్పటి టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో సమీకరణాలు మారుతుంటాయన్నారు. ఎన్నికలప్పుడు పొత్తులుంటాయని తేల్చిచెప్పారు.
పవన్ ఏం చెప్పారంటే..
కుప్పం ఘటనపై చంద్రబాబును కలిశాను. వైసీపీ అరాచకాలపై మాట్లాడుకున్నాం. రైతు సమస్యలు , పెన్షన్ల తొలగింపుపై చర్చించాం. ఏపీలో బ్రిటీష్ కాలం నాటి జీవో తెచ్చారు . సీఎం జగన్ ఓటమి భయంతోనే చెత్త జీవోలు తెస్తున్నారు. ప్రతిపక్ష నేతల హక్కులను కాలరాస్తున్నారు. ప్రతిపక్షాలను ప్రజల్లో తిరగనివ్వడంలేదు. విశాఖలో నాపై ఆంక్షలు పెట్టారు. కుప్పంలో చంద్రబాబును తిరగ నివ్వకపోవడం సరికాదు. భద్రతా వైఫల్యం వల్లే కందుకూరు, గుంటూరు ఘటనలు జరిగాయి. వైసీపీ అరాచకాలపై బీజేపీతో చర్చిస్తాం. నేను అడుగు తీసి అడుగు వేస్తే వాళ్లు ఇబ్బందేంటి? రూల్స్ అందరికీ వర్తిస్తాయంటారు. కానీ అమలు చేయరు. పోలీసులు నిస్తేజంగా ఉండటం వల్లే ఏపీలో శాంతి భద్రతల సమస్యలు. నేను వారాహి వాహనం కొనుక్కుంటే వైసీపీ నేతలకు ఇబ్బందేంటి?
బీఆర్ఎస్ కు స్వాగతం
ఏపీలో బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నాం. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. పొత్తులపై ఇప్పుడే మట్లాడటం సరికాదు. మొత్తం మీద పవన్ -చంద్రబాబు భేటీ ఏపీలో రాజకీయాలను హీటెక్కించింది. కలిసి పోరాటం చేస్తామని ఇరువురు నేతలు ప్రకటించడంతో ఇక పొత్తుల ప్రకటన లాంఛనమేనని తేలిపోయింది.